కోటగిరి/ఖలీల్వాడి,జూలై27:వానకాలం వచ్చిందంటే చాలు విద్యుత్ ప్రమాదాలు తరుచూ జరుగుతుంటాయి. దీంతో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంటి వద్ద, పంట పొలాల్లో విద్యుత్ వినియోగంలో జాగ్రత్తలు పాటించాలి. బోరుబావులు, వాగుల వద్ద మోటర్లు ఏర్పాటు చేసి పంటలను సాగు చేస్తున్నారు. ఈ కీలక సమయంలో రైతులు చేసే చిన్నపాటి తప్పిదాలే వారి ప్రాణాల మీదకు తెస్తున్నాయి. ఏ మాత్రం ఏమరుపాటు వహించకుండా రైతులు పలు జాగ్రత్తలు పాటించాలని విద్యుత్ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
పంట పొలాలకు నీరు పెట్టే సమయంలో విద్యుత్ బోర్డు వద్ద తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి. వర్షానికి సాగు భూమి నిరంతరం తడిగా ఉంటుంది. విద్యుత్ తీగలు ఎక్కడైనా కాస్త తెగి ఉండొచ్చు.. దానిని గుర్తించాలి. లేని పక్షంలో షార్ట్సర్క్యూట్కు దారితీసే అవకాశముంది. ఫీజులున్న ప్రదేశంలో తడిగా లేకుండా చూసుకోవాలి. మోటరు స్విచ్ఛాన్ చేసే సమయంలో కాళ్లకు చెప్పులు వేసుకోవాలి.
కంచె ఏర్పాటుతో రక్షణ..
వ్యవసాయ భూముల వద్ద సాధారణంగా విద్యుత్ నియంత్రికలను ఏర్పాటు చేసుకుంటారు. వాటికి తప్పకుండా కంచెలను ఏర్పాటు చేసి రక్షణ కల్పించాలి. చిన్నపాటి వర్షం పడినా.. భూమి తడిగా ఉండి అటువైపు వెళ్లే వ్యక్తులకు కరెంట్ షాక్ తగిలే అవకాశం ఉంది.
పాటించాల్సినవి..
బట్టలు ఆరేసుకునేందుకు విద్యుత్ వైర్లు దగ్గర లేకుండా చూసుకోవాలి.
విద్యుత్ తీగలు అమర్చిన కర్రల వద్దకు వెళ్లొద్దు.
వానకాలంలో రైతులు మోటర్లు స్విచ్ఛాన్ చేసే ముందు తప్పకుండా చెప్పులు ధరించాలి.
విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లకు రైతులు మరమ్మతులు చేయొద్దు.
ట్రాన్స్ఫార్మర్కు మరమ్మతులు చేయాల్సి వస్తే విద్యుత్ సిబ్బందికి సమాచారం అందించాలి.
ఫ్యూజ్ కాలిపోయినప్పుడు విద్యుత్ మోటర్లను తాకకూడదు.
మోటరు పని చేయకుంటే చేతితో తాకకూడదు.
టెస్టర్ ఉపయోగించి మాత్రమే మోటర్ను పరీక్షించాలి.
ఎర్తింగ్ తప్పనిసరి..
ఇంట్లో, విద్యుత్ మోటర్లకు తప్పనిసరిగా ఎర్తింగ్ ఏర్పాటు చేసుకోవాలి. వానకురిస్తే తడవకుండా కాపాడుకోవాలి. అంతేకాకుండా పంట పొలాల్లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, స్టార్టర్ల చుట్టూ పిచ్చి మొక్కలు ఉండకుండా చూసుకోవాలి. వేలాడే తీగల కిందకు వెళ్లొద్దు. ఏమైనా సమస్యలు ఉం టే సొంతంగా మరమ్మతులు చేయకుండా విద్యుత్ సిబ్బందికి, అధికారులకు సమాచారం ఇవ్వాలి.
జాగ్రత్తలు పాటించాలి..
వానకాలంలో విద్యుత్తో జాగ్రత్తగా ఉండాలి. తడి చేతులతో విద్యుత్ పరికరాలను, స్విచ్లను తాకకూడదు. పంట పొలాల వద్ద రైతులు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, స్టార్టర్ బాక్సులు, విద్యుత్ మోటర్ల వద్ద జాగ్రత్తలు పాటించాలి.
కంట్రోల్ రూం ఏర్పాటు…
నిజామాబాద్ జిల్లాలో విద్యుత్ ప్రమాదాలు జరుగకుండా ఉండేందుకు జిల్లా విద్యుత్ కార్యాలయంలో 9440811600 నంబరుతో కంట్రోల్ రూం ఏర్పాటు చేశాం. ఎక్కడైనా విద్యుత్ సమస్యలు తలెత్తితే వెంటనే కంట్రోల్ రూం నంబర్కు సమాచారం అందించాలి. లైన్మన్, సంబంధిత విద్యుత్ అధికారులకు సమాచారం ఇవ్వాలి.
-సుదర్శనం, ఎస్ఈ, విద్యుత్శాఖ