నిజాంసాగర్/బిచ్కుంద, జూలై 13: అన్నివర్గాల సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్షిండే అన్నారు. జుక్కల్ మండల పరిధిలో 32 మందికి మంజూరైన కల్యాణలక్ష్మి చెక్కులను స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్రంలోని సబ్బండ వర్ణాలు సంతోషంగా ఉన్నట్లు తెలిపారు. తల్లిదండ్రులకు ఆడబిడ్డల పెండ్లి భారం కావొద్దనే ఉద్దేశంతో కల్యాణలక్ష్మి పథకాన్ని అమలు చేసి, రూ. లక్షా 116 అందజేస్తున్నారని తెలిపారు. ఆసరా పింఛన్లు, రైతుబీమా, రైతుబంధు వంటి పథకాలతో ప్రజా సంక్షేమంలో తెలంగాణ ముందున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఎంపీపీ యశోదా నీలుపటేల్, సొసైటీ చైర్మన్ శివానంద్, నాయకులు పాల్గొన్నారు. బిచ్కుంద మండల పరిధిలో ఇద్దరికి షాదీ ముబారక్ చెక్కులు మంజూరు కాగా, ఎమ్మెల్యే హన్మంత్ షిండే మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలతో పేదలు ఎంతో భరోసాతో బతుకుతున్నారని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ అశోక్ పటేల్, జడ్పీటీసీ భారతీరాజు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
బాధిత కుటుంబాలకు పరామర్శ
బిచ్కుంద మండలకేంద్రంలో కరోనాతో మృతిచెందిన వారి కుటుంబాలను ఎమ్మెల్యే హన్మంత్షిండే సోమవారం రాత్రి పరామర్శించారు. తన ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తూ బాధితులకు ధైర్యం చెప్పారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకుంటే చికిత్స చేయించుకున్న బిల్లులు అందేలా కృషి చేస్తానన్నారు. ఎమ్మెల్యే వెంట ఎంపీపీ అశోక్ పటేల్, సొసైటీ చైర్మన్ బాలజీ తదితరులు ఉన్నారు.