చైర్మన్ డబ్బులు వాడుకున్నాడని ఆరోపణ
శాయంపేట, జూలై 15: మండలకేంద్రంలోని పీఏసీఎస్లో చైర్మన్, డైరెక్టర్ల మధ్య గురువారం వాగ్వాదం జరిగింది. ధాన్యం కొనుగోలు సెంటర్ల నిర్వహణ డబ్బులను తమకు ఇవ్వకుండా సొంతానికి వాడుకుని చైర్మన్ కుసుమ శరత్ వేధిస్తున్నాడని డైరెక్టర్లు బగ్గి రమేశ్, చాడ మహేందర్, సదర్లాల్ వాగ్వాదానికి దిగారు. రమేశ్కు రూ. 1.30 లక్షలు, మహేందర్కు రూ. 80 వేలు, సదర్లాల్కు రూ. 80 వేలు ఇవ్వాల్సి ఉందని, చైర్మన్ జనవరి నెలలో మొత్తం రూ. 7 లక్షలు డ్రా చేసుకుని నలుగురు డైరెక్టర్లకు చెల్లించి, తమకు ఇవ్వడం లేదని ఆరోపించారు. ఈ విషయమై తాము పోలీసులు, జిల్లా సహకార అధికారికి ఫిర్యాదు చేసినట్లు రమేశ్ తెలిపారు. ఈ సందర్భంగా బాధిత డైరెక్టర్లు మాట్లాడుతూ గత చైర్మన్కు కమీషన్ డబ్బులు రూ. 3.60 లక్షలు ఇచ్చేందుకు చైర్మన్ శరత్ తనకు రూ. 3 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడని తెలిపారు. ఈ మేరకు చైర్మన్ రూ. 6.30 లక్షలు డ్రా చేసి రూ. 3 లక్షలు సొంతానికి వాడుకున్నట్లు ఆరోపించారు. మక్కల కొనుగోలు కోసం బార్దాన్ డబ్బులను రైతులకు ఇవ్వకుండా గత ఏప్రిల్లో రూ. 60 వేలను చైర్మన్ తన కోడలు ఖాతాలో జమ చేసుకున్నట్లు ఆరోపించారు. అలాగే, యాసంగి సీజన్లో రైతుల నుంచి 130 ట్రక్షీట్లను చైర్మన్ తన వద్దే పెట్టుకుని రవాణా కాంట్రాక్టర్ నుంచి రూ. 1.25 లక్షలు తీసుకున్నట్లు విమర్శించారు. ట్రక్షీట్లపై సంతకాలు చేసేందుకు డైరెక్టర్ అయిన తన వద్దే చైర్మన్ రూ. 70 వేలు తీసుకున్నాడని సదర్లాల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా పలు సందర్భాల్లో అవినీతి, అక్రమాలకు పాల్పడిన చైర్మన్పై ఉన్నతాధికారులు విచారణ చేసి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.