గీసుగొండ, అక్టోబర్ 25: పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివని వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్జోషి అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా సోమవారం గీసుగొండ పోలీసుల ఆధ్వర్యంలో కొనాయిమాకులలోని పీడీఆర్ గార్డెన్లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు, స్థానిక ప్రజాప్రతినిధులు, యువకులు రక్తదానం చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన సీపీ తరుణ్జోషి.. ఈస్ట్ జోన్ డీసీపీ వెంకటలక్ష్మితో కలిసి వారికి సర్టిఫికెట్లు అందజేశారు. అనంతరం సీపీ మాట్లాడుతూ దేశ రక్షణ కోసం ప్రాణ త్యాగం చేసిన పోలీసు అమరులను స్మరించుకోవాలని కోరారు. పోలీసులు తమ కుటుంబ సంక్షేమం కన్నా సామాజిక శ్రేయస్సుకే అధిక ప్రాధాన్యం ఇస్తారని వివరించారు.
దేశం కోసం ప్రాణ త్యాగం చేస్తున్న జవాన్లు, దేశంలో పని చేస్తున్న పోలీసులు నిరంతరం స్వేచ్ఛ, శాంతి కోసం పని చేస్తారని, అలాంటి వారిని గుర్తుంచుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. సమయానికి రక్తం అందక ఎంతో మంది తమ ప్రాణాలు కోల్పోతున్నారని, అలాంటి వారికి దాతలు అందించే రక్తం ఎంతో విలువైందన్నారు. రక్తదానం చేయడం మంచి మనస్సుతో కూడుకున్నదన్నారు. ప్రతి వ్యక్తి రక్తదానం చేసి ఆపదలో ఉన్న మరొకరి ప్రాణాలు కాపాడాలని సీపీ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మమునూరు ఏసీపీ నరేశ్కుమార్, సీఐ రాయల వెంకటేశ్వర్లు, ఎస్సైలు పెండ్యాల దేవేందర్, అబ్దుల్ రహీం, భాస్కర్రెడ్డి, పోలీసు సిబ్బంది, సర్పంచ్లు నాగేశ్వర్రావు, వీరాటి కవిత, డోలి రాధాబాయి, దౌడు బాబు పాల్గొన్నారు.
పోలీసులకు అభినందనలు
సంగెం: పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో సంగెం పోలీసులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా హెడ్కానిస్టేబుల్ శ్రీనాథ్, కానిస్టేబుల్ కుమారస్వామి రక్తదానం చేశారు. వీరికి ఎస్సై భాస్కర్రెడ్డి ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు.