వరంగల్, సెప్టెంబర్ 14 : వరంగల్ ఎంజీఎం దవాఖాన మార్చురీలో అనాథ మృతదేహాలు దహనం కోసం పడిగాపులు కాయాల్సి వస్తున్నది. గ్రేటర్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విద్యుత్ దహన యంత్రం పనిచేయడం లేదు. కనీసం కట్టెలతోనైనా కాల్చేయాల్సిన బల్దియా యంత్రాంగం పట్టించుకోవడం లేదు. దీంతో మార్చురీలోనే పది రోజులుగా నాలుగు అనాథ శవాలు మగ్గిపోతున్నాయి. అనాథ శవాలకు అంతిమ సంస్కారాలు చేయాల్సిన బాధ్యత గ్రేటర్ కార్పొరేషన్ పైనే ఉన్నది. బల్దియా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్మశాన వాటికలో ఏర్పాటు చేసిన విద్యుత్ దహన యంత్రం కొన్ని రోజులుగా పనిచేయడం లేదు.
దీంతో ఎంజీఎంలో మృతి చెందిన ఆనాథ శవాలకు దహన సంస్కారాలు చేయాలని ఎంజీఎం అధికారులు, పోలీసు స్టేషన్ అధికారులు గ్రేటర్ అధికారులకు మొర పెట్టుకున్న తీసుకపోవడం లేదు. దీంతో రోజుల తరబడి ఆనాథ శవాలు మార్చురీలోనే ఉంటున్నాయి. గతంతో అనాథ శవాలను కార్పొరేషన్ అధికారులు పూడ్చిపెట్టేవారు. కరోనా మృతదేహాలను కుటుంబ సభ్యులు సైతం తీసుకువెళ్లని పరిస్థితుల్లో అప్పటి కమిషనర్ పమేలా సత్పతి ప్రత్యేక చొరవ తీసుకుని విద్యుత్ దహన యంత్రాన్ని రూ.10లక్షలతో కొనుగోలు చేసి బిగించారు. కరోనా ఉధృతి సమయంలో బాగానే పని చేసిన ఈ యంత్రం చెడిపోయింది. దీంతో అప్పట్లో కట్టెలతోనే కరోనా మృతదేహాలను దహనం చేశారు.
రెండు దహన యంత్రాలతో అనాథ, కరోనా మృతదేహాలకు దహన సంస్కారాలు చేస్తున్న సమయంలో మొదట ఏర్పాటు చేసిన యంత్రం చెడిపోవడంతో సదరు కంపెనీ ఇంజినీర్లు దాన్ని మరమ్మతు కోసం తీసుకెళ్లారు. శ్మశాన వాటికలో ఉన్న రెండో విద్యుత్ దహన యంత్రం సైతం 20 రోజులుగా పనిచేయడం లేదు. దీంతో ఎంజీఎంలో ఉన్న అనాథ శవాలను తీసుకెళ్లి దహన సంస్కారాలు చేయాలని ఎంజీఎం అధికారులు గ్రేటర్ అధికాలకు ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు. దాదాపు పది రోజులుగా నాలుగు అనాథ శవాలు ఎంజీఎం మార్చురీలోనే దహన సంస్కారాల కోసం ఎదురు చూస్తున్నాయి.
కూలిన శ్మశాన ప్రహరీ
కార్పొరేషన్ ఆవరణలోని ఇండోర్ స్టేడియం వెనుకాల ఏర్పాటు చేసిన శ్మశాన వాటిక ప్రహరీ కూలిపోయింది. వాటికలోకి వరద నీరు రాకుండా గతేడాది దీనిని నిర్మించారు. నాణ్యతా ప్రమాణాలను బల్దియా ఇంజినీర్లు పట్టించుకోకపోవడంతో మొన్నటి వర్షాలకు అది కూలిపోయింది. దీంతో శ్మశాన వాటికలోకి పెద్ద ఎత్తున నీరు చేరడంతో విద్యుత్ దహన యంత్రం పూర్తిగా చెడిపోయింది.