గీసుగొండ, జూలై 9: కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో యూనిట్స్ ఏర్పాటుకు కేరళ రాష్ర్టానికి చెందిన కైటెక్స్ గార్మెంట్స్ కంపెనీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నది. కంపెనీ అధినేత, మరో ఆరుగురితో పాటు టీఎస్ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి హైదరాబాద్ నుంచి హెలీకాప్టర్లో శనివారం సాయంత్రం గీసుగొండ మండలం శాయంపేట టెక్స్టైల్ పార్కుకు చేరుకున్నారు. వారికి కలెక్టర్ హరిత స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పార్కులో మూడు చోట్ల ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్థలాలను పరిశీలించారు. పార్కులో ప్రభుత్వం చేపడుతున్న మౌలిక సదుపాయాలను టీఎస్ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి వారికి వివరించారు. వరంగల్-నర్సంపేట ప్రధాన రోడ్డు నుంచి టెక్స్టైల్ పార్కు వరకు డబుల్ రోడ్లు వేసినట్లు అయన వారికి తెలిపారు. నీటి సదుపాయం కోసం ప్రభుత్వం పనులను చేపట్టినట్లు వివరించారు. పార్కులో అన్ని రకాల పనులు నాణ్య తా ప్రమాణాలతో జరుగుతున్నాయని వెల్లడించారు. ఈ సందర్భంగా క్వాటెక్స్ కంపెనీ అధినేత సాబుజాకప్ పార్కులో పనులు నాణ్యతతో జరుగుతున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. 150 ఎకరాల స్థలంలో రూ. 3500 కోట్ల పెట్టుబడితో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కంపెనీ ఏర్పాటు చేయబోతున్నట్లు వివరించారు.
సీఎం కేసీఆర్ గొప్పవారు..
పార్కును పరిశీలించిన అనంతరం కంపెనీ అధినేత సాబుజాకప్ ‘మీ సీఎం కేసీఆర్ గట్టివారు. చాలాగొప్ప వారు. మీకు సీఎంగా ఉండడం మీ అదృష్టం’ అని ఆయన స్థానికులతో చెప్పారు. అలాగే, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ చాలా మంచివారని, రాష్ర్టాన్ని అభివృద్ధి చేస్తున్న గొప్పవారని అన్నారు. త్వరలోనే ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుని తమ కంపెనీ పనులను ప్రారంభించేందుకు వస్తామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ ముండ్రాతి హరిత, ఆర్డీవో మహేందర్జీ, టీఎస్ఐఐసీ జనరల్ మేనేజర్ రతన్రాథోడ్, డిప్యూటీ జనరల్ మేనేజర్ సంతోష్, డీఆర్డీవో సంప త్, తహసీల్దార్ సుహాసిని, ఆర్ఐ అర్జున్ పాల్గొన్నారు.