జయశంకర్ భూపాలపల్లి, డిసెంబర్15 (నమస్తే తెలంగాణ);ఆస్తిపన్ను చెల్లించని వారిపై భూపాలపల్లి మున్సిపాలిటీ అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలో రూ. 2.39 కోట్ల బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. ఇందులో కేవలం రూ.28.70 లక్షలు మాత్రమే వసూలయ్యాయి. ఇటీవల నిర్వహించిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో బకాయిల విషయమై అదనపు కలెక్టర్ దివాకర ఆగ్రహం వ్యక్తంచేసినట్లు సమాచారం. దీంతో పెద్ద మొత్తంలో బకాయి ఉన్న 30 మందికి అధికారులు రెడ్ నోటీసులు జారీ చేశారు. ఇచ్చిన గడువులోగా పన్నులు చెల్లించని వారి ఆస్తుల జప్తునకు ప్రత్యేకంగా ఐదు టీములను ఏర్పాటు చేశారు. మొండి బకాయిదారుల ఆస్తుల జప్తు చేసే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన సిబ్బంది జప్తు చేసిన సామగ్రిని మున్సిపాలిటీకి తరలిస్తున్నారు.
పన్నుల వసూలుకు భూపాలపల్లి మున్సిపల్ అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. మొండి బకాయిదారుల నుంచి పన్ను వసూలుకు ప్రత్యేకంగా ఐదు టీమ్లను ఏర్పాటు చేశారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో 2020-21 సంవత్సరానికి 2.39 కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. ఇందులో కేవలం రూ.28.70 లక్షలు మాత్రమే అధికారులు వసూలు చేశారు. ఇటీవల నిర్వహించిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ దివాకర పన్నుల బకాయిలపై తీవ్రంగా స్పందించినట్లు సమాచారం. దీంతో పెద్ద మొత్తంలో బకాయి ఉన్న 30 మందికి అధికారులు రెడ్ నోటీసులు జారీ చేశారు. వారి వద్ద నుం చి పన్నులు వసూలు చేసేందుకు టీమ్లను ఏర్పాటు చేసి ఆస్తులు జప్తు చేయడంలో వెనుకాడడంలేదు.
బకాయిలు ఇవే..
మున్సిపాలిటీ పరిధిలో నివాస, వ్యాపార, రెండు కలిసి ఉండే ఆస్తులు 11,638 ఉన్నాయి. ఇందులో పూర్తిగా నివాసం సంబంధంగా ఉన్నవి 10,449, వ్యాపారానివి 543, నివాస, వ్యాపార సం బంధ ఆవాసాలు 646 ఉన్నట్లు మున్సిపాలిటీ అధికారిక గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఇందులో నివా స, వ్యాపార సంబంధ ఆస్తి పన్నుల నుంచి రావాల్సిన బకాయిలు రూ.17.39 లక్షలు, వ్యాపారాలకు సంబంధించిన ఆస్తి పన్నుల బకాయిలు రూ.35.14 లక్షలు, నివాసాలకు సంబంధించిన ఆస్తి పన్ను బకాయిలు 1.87 కోట్లు ఉన్నట్లు అధికారిక గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఇందులో డిసెంబర్లో వసూలు చేసినవి కేవలం రూ. 28.70 లక్షలు మాత్రమే ఉన్నాయి.
మొండి బకాయిదారులకు రెడ్ నోటీసులు
భారీ మొత్తంలో ఆస్తి పన్నులు బకాయి ఉన్న 30 మంది యజమానులకు మున్సిపల్ అధికారులు రెడ్ నోటీసులు జారీ చేశారు. ఇచ్చిన గడువులోగా పన్ను చెల్లించని వారి ఆస్తులను జప్తు చేపేందుకు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే కొందరివి జప్తు చేయగా వాటిని మున్సిపల్ కార్యాలయానికి తరలిస్తున్నారు.
పన్నుల వసూళ్లకు ఐదు టీమ్లు
మున్సిపాలిటీ పరిధిలో పాత, కొత్త ఆస్తి పన్నులు వసూలు చేసేందుకు ఐదు టీమ్లను ఏర్పాటు చేశారు. ప్రతి టీమ్లో బిల్ కలెక్టర్, పంప్ ఆపరేటర్, హెల్పర్ ఉంటారు. ప్రతి రోజూ వీరు ఆస్తి పన్నుల వసూళ్లను పటిష్టంగా చేపట్టాల్సి ఉంటుంది. నోటీసులు జారీ చేసిన మొండి బకాయిలతో పాటు 2021-22 ఆస్తి పన్నులు సైతం వసూలు చేయనున్నారు.