జయశంకర్ భూపాలపల్లి/ములుగు, జనవరి 25( నమస్తేతెలంగాణ): ఫస్ట్, సెకండ్ వేవ్ల్లో కరోనా వైరస్ జనాలపై విరుచుకుపడింది. 2020 మార్చి నెలలో ప్రారంభమైన మొదటి దశలో అల్ఫా రూపంలో, 2021లో డెల్టా రూపంలో ఎందరో ప్రాణాలను బలిగొన్నది. ఇంటికి పెద్దదిక్కులను కోల్పోయి చాలా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ప్రస్తుతం థర్డ్వేవ్లో కరోనా వైరస్తోపాటు ఒమిక్రాన్ విజృంభిస్తున్నది. ప్రతి ముగ్గురిలో ఇద్దరికి వైరస్ లక్షణాలున్నట్లు వైద్యులు చెబుతున్నారు. కానీ, మొదటి, రెండో వేవ్లతో పోలిస్తే మూడో వేవ్లో కరోనా వైరస్ తీవ్రత చాలా వరకు తగ్గింది. వ్యాక్సినేషన్తోపాటు ప్రజల ఆహారపు అలవాట్లు మారి రోగనిరోధక శక్తి పెరిగింది. దీంతో వైరస్ సోకినా పెద్దగా ప్రభావం చూపించడం లేదు. వారం రోజులపాటు హోం క్వారంటైన్లో ఉండి, వైద్యుల సలహా మేరకు మందులు వాడి కోలుకుంటున్నారు.
దవాఖానల్లో చేరేవారు లేరు
ప్రస్తుతం చాలామందికి వైరస్ సోకుతున్నా దవాఖానల్లో చేరే వారి సంఖ్య చాలా తక్కువ. కనీసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐసొలేషన్ కేంద్రాల్లో కూడా ఎవరూ చేరడం లేదని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. హోం క్వారంటైన్లో ఉంటూ ప్రభుత్వం అందించిన మెడికల్ కిట్లను వాడుతున్నారు తప్పా.. దవాఖానల వైపు చూడడం లేదు. దీంతోపాటు దవాఖానల్లో ఆక్సిజన్ బెడ్ల వాడకం కూడా పూర్తిగా తగ్గిపోయింది. గతంలో వందల సంఖ్యలో ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేసినా సరిపోక బాధితులు నానా తంటాలుపడ్డారు. ప్రస్తుతం వైరస్ సోకినా ఆక్సిజన్ బెడ్స్ అవసర పడడం లేదని వైద్యులు చెబుతున్నారు. గతంలో కొవిడ్ పాజిటివ్ వచ్చిన వారు కనీసం 14 రోజుల హోం క్వారంటైన్లో ఉండి మందులు వాడే వారు. ప్రస్తుతం వైరస్ ప్రభావం ఎక్కువగా లేకపోవడంతో పాజిటివ్ వచ్చిన వారు కేవలం ఏడు రోజులు మాత్రమే హోం క్వారంటైన్లో ఉంటున్నారు. వైద్యశాఖ అందించిన మందుల కిట్లను వాడుతున్నారు.
సత్ఫలితాలను వ్యాక్సినేషన్, జ్వర సర్వే..
రాష్ట్ర ప్రభుత్వం, ఐసీఎంఆర్ టెక్నికల్ టీం సభ్యులు ఎప్పటికప్పుడు అందిస్తున్న సమాచారం మేరకు ముమ్మరంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టడడంతో ప్రజల్లో రోగనిరోధక శక్తి పెరిగింది. థర్డ్వేవ్లో వైరస్ వ్యాప్తి ఎక్కువ ఉన్నా పెద్దగా జనాల్లో ప్రభావం చూపడం లేదు. ప్రణాళికబద్ధంగా వ్యాక్సినేషన్ చేయడమే ఇందుకు కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతోపాటు లక్షణాలు ఉన్న వారిని ముందుగానే గుర్తించేందుకు రాష్ట్ర సర్కార్ రెండు విడుతల్లో చేపట్టిన ఫీవర్ సర్వే అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నది. వైద్యసిబ్బంది ఇంటింటికీ తిరిగి లక్షణాలున్న వారిని గుర్తించి మెడికల్ కిట్లు అందజేయడం, వాటి వాడకంపై అవగాహన కల్పించడం వల్ల ప్రాథమిక దశలోనే వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట పడుతున్నది. పాజిటివ్ వచ్చిన వారు కూడా దవాఖానల్లో చేరే పరిస్థితి ఉండడం లేదు.
స్వీయ నియంత్రణతో వైరస్ కట్టడి
స్వీయ నియంత్రణతోనే వైరస్ కట్టడి చేయొచ్చు. ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ ధరించడంతోపాటు భౌతిక దూరం పాటించాలి. గుంపులు గుంపులుగా ఉండొద్దు. రెండు డోస్ల వ్యాక్సిన్ తీసుకోవాలి. పాజిటివ్ వచ్చిన వారు ఏడు రోజులపాటు హోం క్వారంటైన్లోఉంటూ వైద్యుల సలహా మేరకు మందులు వాడాలి.