భూపాలపల్లి : ప్రభుత్వం అటవీభూముల హక్కుల చట్టం కింద అటవీ భూముల్లో కాస్తులో ఉన్న భూములకు మాత్రమే పట్టాలు (హక్కు పత్రాలు) ఇవ్వడానికి నిర్ణయించుకుందని, ప్రభుత్వ భూముల్లో కబ్జాలో ఉన్న వారికి కాదని జాయింట్ కలెక్టర్ కూరాకుల స్వర్ణలత అన్నారు. సోమవారం భూపాలపల్లిలోని జిల్లా పరిషత్ కాన్ఫరెన్స్ హాలులో సర్పంచ్లు, ఎంపీటీసీలు, గ్రామ కార్యదర్శిలు, అటవీశాఖ అధికారులు, రెవెన్యూ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ 2006లో అటవీ భూముల హక్కుల చట్టం అమల్లోకి వచ్చిందని, అప్పటి నుంచి అటవీ భూములను పోడు చేసుకున్న వారికి విచారణ జరిపి హక్కు పత్రాలు ఇస్తూ వస్తుందని అన్నారు. అయితే అది పూర్తి స్థాయిలో అమలు జరుగడం లేదన్నారు.
2005 డిసెంబర్ 13 వరకు అటవీ భూముల్లో కాస్తులో ఉన్న వారికి పట్టాలు వస్తాయన్నారు. కాగా సీఎం కేసీఆర్ అటవీ భూములు అన్యాక్రాంతం కారాదనే ఉద్ధేశ్యంతో అటవీ భూముల హక్కుల చట్టం మళ్లీ అమల్లోకి తీసుకువచ్చారని, అర్హులైన వారికి పట్టాలు ఇచ్చి అటవీ హద్దులు నిర్ణయించి , ఇక నుంచి సెంటు భూమి కూడా కబ్జా జరుగకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కాస్తులో ఉన్న వారందరూ దరఖాస్తు చేసుకోవాలని, ఎఫ్ఆర్సీ, డివిజన్, జిల్లా కమిటీలు విచారణ జరిపి పట్టాలు జారీ చేస్తాయన్నారు. ప్రతి కుటుంబానికి 10 ఎకరాలకు పట్టా ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మందల లావణ్యసాగర్రెడ్డి, తహసీల్దార్ ఇక్భాల్, ఎంపీడీఓ అనిల్కుమార్ పాల్గొన్నారు.