ఏఆర్కు అటాచ్ చేస్తూ సీపీ ఉత్తర్వులు
అవినీతి ఆరోపణల నేపథ్యంలో చర్యలు!
హన్మకొండ సిటీ, మార్చి 21 : అవినీతి ఆరోపణల నేపథ్యంలో కాజీపేట ఏసీపీ రవీంద్రకుమార్ యాదవ్ను కమిషనరేట్ ఏఆర్ విభాగానికి అటాచ్ చేస్తూ వరంగల్ పోలీసు కమిషనర్ ప్రమోద్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. కాజీపేట డివిజన్ పరిధిలోని ఠాణాల్లో ఎఫ్ఐఆర్లు నమోదు కాకుండా సీఐలపై ఒత్తిడి తేవడం, భూకబ్జాదారులకు వత్తాసు పలుకుతూ సెటిల్మెంట్స్తో జేబులు నింపుకోవడం వంటి ఆరోపణలు ఏసీపీ రవీంద్రకుమార్పై వచ్చిన నేపథ్యంలో ఏఆర్కు అటాచ్ చేసినట్లు సమాచారం. గతంలోనే ఏసీపీ వ్యవహారంపై సీఐలు ఉన్నతాధికారులతో పాటు సీఎంవోకు సమాచారం అందించినట్లు తెలుస్తున్నది. నిత్యం వివాదాల్లో నిలుస్తూ పోలీస్శాఖకు మచ్చ తీసుకొస్తున్న ఏసీపీని అక్కడి నుంచి బదిలీ చేయాలనే ఆలోచనతోనే ఏఆర్కు అటాచ్ చేసినట్లు తెలిసింది. గతంలో క్రైం ఏసీపీ బాబురావు కాజీపేట ఏసీపీ రియల్ దందాపై సోషల్మీడియా వేదికగా కామెంట్స్ చేయగా ఏసీపీ బాబురావును సీపీ ప్రమోద్కుమార్ కమిషనరేట్కు అటాచ్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బాబురావు చేసిన ఆరోపణలతో కాజీపేట ఏసీపీ రవీంద్రకుమార్ కమిషనరేట్కు అటాచ్ కావడం విశేషం.