భూపాలపల్లి టౌన్, మే 11: కొవిడ్ నియంత్రణతో పా టు సాధారణ వైద్య సేవలకు ఆటంకం కలుగకుండా సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఆదేశించారు. మంగళవారం జిల్లా దవాఖానను కలెక్టర్ పరిశీలించారు. ముందుగా కలెక్టర్ బ్లడ్ షాంపిల్ ఇచ్చి వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించాలని సంబంధిత ల్యాబ్ టెక్నీషియన్కు సూచించారు. అనంతరం వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సంబంధిత వైద్య అధికారులతో కలెక్టర్ సమావే శం ఏర్పాటు చేసి మాట్లాడారు. కొవిడ్ నియంత్రణతో పా టు సాధారణ వైద్య, ప్రసూతి సేవలు ప్రభుత్వ దవాఖానల్లో సమర్థవంతంగా అందించేందుకు వైద్య సిబ్బంది సిద్ధంగా ఉండాలని అన్నారు. ఔట్సోర్సింగ్ సిబ్బంది వేతనాలకు ఇబ్బంది కలుగకుండా ఎప్పటికప్పుడు అందించేలా చర్య లు తీసుకోవాలన్నారు. 108, 104 వాహనాలను ప్రజల ఆరోగ్య సంరక్షణ దృష్ట్యా ప్రజలకు అందుబాటులో ఉంచి సేవలందించాలన్నారు.
మాతా, శిశు సంరక్షణ కేంద్రంలో వైద్య సిబ్బంది ఖాళీలు లేకుండా చూడాలన్నారు. కరోనా నియంత్రణలో ప్రజలను రక్షించడంలో వైదాధికారులు పోరాడుతున్నారని కొనియాడారు. ప్రైవేట్ దవాఖానలను పరిశీలించి నిబంధనలకు విరుద్ధంగా ఏమైనా కార్యకలాపాలు జరిగితే చర్యలు తీసుకోవాలని కోరారు. పీహెచ్సీలు, హెల్త్ సబ్ సెంటర్లలో ఖాళీల వివరాలను వెంటనే అందించాలని కోరారు. ప్రతి ఆరోగ్య కేంద్రంలో పల్స్ ఆక్సీమీటర్, థర్మామీటర్, కరోనాకు సంబంధించిన అన్ని మందులు ఉండాలన్నారు. మాతా శిశు సంరక్షణ కేంద్రంలో గైనకాలజిస్టుగా డిప్యూటీ డీఎంహెచ్వో శ్రీదేవిని రెండు నెలలు ఆన్ డ్యూటీపై పనిచేయాలని కోరారు. సమావేశంలో డీఎంహెచ్వో డాక్టర్ సుధార్సింగ్, డీసీహెచ్ఎస్ డాక్టర్ తిరుపతి, డిప్యూటీ డీఎంహెచ్వోలు కొమురయ్య, శ్రీదేవి, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ మమత, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ ఉమాదేవి, రవికుమార్, ఎన్హెచ్ఎం అధికారి చిరంజీవి పాల్గొన్నారు.