మత్తు ఇంజెక్షన్ ఇచ్చి బంధించి..
జూపార్కుకు తరలించిన అధికారులు
జఫర్గఢ్, జూన్ 11 : మండలంలోని హిమ్మత్నగర్లో శుక్రవారం ఎలుగుబంటి హల్చల్ చేసింది. చింతచెట్టు ఎక్కి నానా హంగామా చేసింది. నర్సయ్య ఇంటి సమీపంలోని చింత చెట్టుపై ఎలుగుబంటి ఉండడం చూసి గ్రామస్తులు సర్పంచ్ తాటికాయల అశోక్కు చెప్పారు. ఆయన ఎస్సై కిశోర్కు, ఫారెస్ట్ బీట్ అధికారి నాగరాజుకు, ఫారెస్ట్ రేంజ్ అధికారి కొండల్రెడ్డికి సమాచారం ఇచ్చారు. వారు వెటర్నరీ ఆఫీసర్ ప్రవీణ్కుమార్ ఆధ్వర్యంలో రెస్క్యూ టీంతో హిమ్మత్నగర్కు చేరుకున్నారు. దానిని బంధించేందుకు ప్రయత్నించినా వలకు చిక్కకపోవడంతో మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. స్పృహ కోల్పోయిన భల్లూకాన్ని వరంగల్ జూపార్క్కు తరలించారు. దీంతో గ్రామస్తులు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.