జయశంకర్ భూపాలపల్లి, మే 17 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను ప్రవేశ పెట్టి అమలు చేస్తుంది. ఇందులో భాగంగా రూ.5 లక్షల వరకు ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పిస్తోంది. 2022-23 సంవత్సరానికి గాను మత్స్యకారులకు గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కోసం మత్స్యసహకార సంఘాల్లోని సభ్యుల జాబితా ఈ నెల 20 వరకు జిల్లా మత్స్యశాఖ కార్యాలయంలో సమర్పించి ఆన్లైన్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. జయశంకర్ జిల్లాలో 95 మత్స్య సహకార సంఘాలు ఉండగా 8,760 మంది సభ్యులు ఉన్నారు. వీటిలో 12 మహిళా సహకార సంఘాలుండగా 1,600 మంది సభ్యులున్నారు. కొత్తగా సహకార సంఘంలో సభ్యత్వం పొందాలనుకునే మత్స్యకారులు 18 నుంచి 55 ఏండ్లలోపు ఉండాలి. మత్స్యకారుడికి పూసల వల అల్లడం, ఈత కొట్టడం, తెప్ప వేసుకొని చేపలు పట్టడం వంటి అర్హతలు ఉంటేనే సభ్యత్వం కల్పించనున్నారు. సభ్యుడిగా చేరాలనుకునే వారు రూ. 55 చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో వాటాధనం రూ. 50, ప్రవేశ రుసుముగా రూ. 5 చెల్లించాలి.
ఈ నెల 20వరకు జాబితా..
2022-23 సంవత్సరానికి గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కోసం మత్స్య సహకార సంఘాలకు చెందిన అధ్యక్షులు సభ్యుల జాబితాను ఈ నెల 20వ తేదీ వరకు జిల్లా మత్స్య శాఖ కార్యాలయంలో సమర్పించి ఆన్లైన్ చేయించుకోవాల్సి ఉంటుంది. సభ్యుల వివరాలు ఆన్లైన్లో నమోదు చేస్తే తప్ప ప్రమాద బీమా వర్తించదు. ఈ పథకంలో నమోదైన మత్స్యకారులు ప్రమాదవశాత్తు మరణిస్తే కుటుంబానికి రూ.5 లక్షలు వరకు చెల్లించనున్నారు.
సద్వినియోగం చేసుకోవాలి
రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల శ్రేయ స్సు కోసం అమలు చేస్తున్న బీమా సదుపాయాన్ని మత్స్య కారులు సద్వినియో గం చేసుకోవాలి. సభ్యత్వ జాబితాలను సకాలంలో కార్యాలయంలో సమర్పించి, ఆన్లైన్ చేయటానికి సహకరించాలి. ఇందుకు ఆయా సంఘాల అధ్యక్షులు బాధ్యత తీసుకోవాలి. ఆన్లైన్లో నమోదు చేసుకోకుంటే బీమా వర్తించదు. ప్రతి ఒక్కరూ తప్పక ఆన్లైన్ చేసుకోవాలి.
– ఆర్ అవినాశ్, జిల్లా మత్స్యశాఖ అధికారి, జయశంకర్ భూపాలపల్లి