రామకృష్ణాపూర్, మే 17 : సింగరేణిలో రెస్క్యూ విభాగంం సేవలు వెలకట్టలేనివి. 1985 రెస్క్యూ రూల్స్ ప్రకారం ఆర్ఆర్ఆర్ టీ (రెస్క్యూ రూం విత్ రిఫ్రెషర్ ట్రైనింగ్) కేంద్రాలు ప ని చేస్తున్నాయి. ఈ కేంద్రాలు ప్రతి 35 కిలోమీటర్ల పరిధిలో ప్రధాన రహదారి మార్గంలో ఏర్పాటు చేశారు. సింగరేణి వ్యా ప్తంగా రామకృష్ణాపూర్, భూపాలపల్లి, కొత్తగూడెంతో పాటు రామగుండం ఆర్జీ-2లో మైన్స్ రెస్క్యూ స్టేషన్ (ఎంఆర్ఎస్) ఉన్నాయి. రామకృష్ణాపూర్ కేంద్రంలో 161 మంది, భూపాలపల్లిలో 86, కొత్తగూడెంలో 70, రామగుండం ఆర్జీ-2లో 161 మంది శిక్షణ పొందిన చురుకైన సభ్యులున్నారు. వీరికితోడు సింగరేణి వ్యాప్తంగా 42 మంది బ్రిగ్రేడర్స్ ఉన్నారు.
2003లో బెల్లంపల్లిలో..
బెల్లంపల్లి రీజియన్ కేంద్రంగా రామకృష్ణాపూర్ ఆర్ఆర్ఆర్ టీ కేంద్రం పని చేస్తున్నది. ఈ సెంటర్ 2003లో ఏర్పాటైంది. దీనికి జక్కారెడ్డి (అసిస్టెంట్ మేనేజర్ ర్యాంక్ అధికారి) ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. వివిధ గనుల్లో విధులు నిర్వహిస్తూనే ఇక్కడి సెంటర్లో 8 మంది బ్రిగ్రేడర్లు, యాక్టివ్ రెస్క్యూ ట్రైయిన్డ్ పర్సన్స్ (ఏఆర్టీపీ)లు ఉంటారు. ఏఆర్టీపీలు 100 మంది కార్మికులకు ఒక్కరి చొప్పున ఉంటారు. ఈ సంఖ్య దాటితే అదనంగా మరొకరిని నియమిస్తారు. గనుల్లో రూప్ పాల్ (గని పైకప్పు కూలినప్పుడు) అయినప్పుడు, మంటలు అంటుకున్నప్పుడు, నీటి ప్రమాదాలు సంభవించినప్పుడు సేవలు అందించడం వీరి విధి.
ఏఆర్టీపీల విధులు..
యాక్టివ్ రెస్క్యూ ట్రైయిన్డ్ పర్సన్స్(ఏఆర్టీపీ) గనుల్లో ప్రమాదాలు జరిగిన ప్రదేశాలకు ముందు తమ సామగ్రితో చేరుకోవడం, ప్రాణాలను పణంగా పెట్టి కంపెనీ ఆస్తులు, ఉ ద్యోగుల ప్రాణాలను రక్షించడంలో వీరు కీలక పాత్ర పోషిస్తా రు. గనుల్లో పైకప్పు కూలిన సందర్భంలో అక్కడ చిక్కుకున్న వారిని కాపాడే క్రమంలో హైడ్రాలిక్ పరికరాలు (టూల్స్), కట్టర్స్ ఉపయోగిస్తారు. ఫైర్ యాక్సిడెంట్లు జరిగినప్పుడు సంస్థ ఆస్తుల రక్షణకు ప్రాధాన్యమిస్తారు. నీటి ప్రమాదం జరిగినప్పుడు అక్కడ చిక్కుకున్నవారిని, యంత్రాలను సురక్షితంగా బయటపడేసేలా చర్యలు చేపడుతారు. ఇటీవల రామగుండం ఆర్జీ-3లోని అండ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్ట్లో రూప్ పాల్ అయిన ప్రమాదంలో 60 మంది సేవలు అందించగా.. వారిలో 33 మంది రామకృష్ణాపూర్కు చెందిన వారే ఉన్నారు. వీరు తమ ప్రాణాలను లెక్కచేయకుండా ముగ్గురిని రక్షించి అధికారుల ప్రశంసలు అందుకున్నారు. వెంకటేశ్ (ఎఫ్బీఎల్ ఆపరేటర్), పిల్లి నరేశ్ (హెడ్ ఓవర్మన్), రవీందర్ (బదిలీ వర్కర్)ను బొగ్గు శిథిలాల కింద నుంచి చాకచక్యంగా ప్రాణాలతో రక్షించి బయటకు తీసుకొచ్చారు.
సామాజిక సేవా కార్యక్రమాలు..
రామకృష్ణాపూర్ ఆర్ఆర్ఆర్ టీ కేంద్రం రెస్క్యూ సిబ్బంది వివిధ సందర్భాల్లో సామాజిక సేవలో పాలు పంచుకున్నారు. 22.07.2021న వాగులో చిక్కిన వారిని రక్షించారు. కాసిపేట మండలం సల్పల వాగు వరదల్లో, వాంకిడి మండలం కోమటిగూడ చెరువులో చిక్కిన వారిని, కాగజ్నగర్లోని పెంచికల్పేట వాగులో చిక్కుకున్న సుమారు 40 నుంచి 50 మందిని రక్షించారు. ఇందుకు గాను కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ ద్వారా 2021, ఆగస్టు 15న ఇన్చార్జి జక్కారెడ్డి టీం అవార్డు తీసుకున్నది.
ఎమర్జెన్సీలో సేవలు చేయడం ఇష్టం..
సంస్థలో రెస్క్యూ బ్రిగ్రేడర్గా పనిచేయడమంటే ఇష్టం. సేవా దృక్పథంతో రెస్క్యూ టీంలో చేరా. సంస్థ కోసం, తోటి ఉద్యోగుల క్షేమం కోసం ఎమర్జెన్సీ విధులు నిర్వహించడం ఉత్తేజాన్ని కలిగిస్తుంది. ప్రమాదాల్లో చిక్కిన కార్మికుల ప్రాణాల రక్షణ కోసం తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకెళ్తాం. ఆ సమయంలో మాకేమైనా అవుతుందేమోననే ఆలోచనే రాదు. ఎంతటి క్లిష్టసమయంలోనైనా వెనుకడుగు వేయం. ప్రమాదంలో చిక్కుకున్న వారిని రక్షించినప్పుడు కలిగే ఆనందమే వేరు.
– కేత గణేశ్ రామన్, హెచ్ఓఎం, ఆర్ఆర్ఆర్టీ
ప్రమాదం ఎక్కడో రెస్క్యూ టీం అక్కడే..
ప్రమాదం ఎక్కడ జరిగినా రెస్క్యూ టీం ముందుగా చేరుకుంటుంది. నేచర్ ఆఫ్ యాక్సిడెంట్ అని తెలిసిన వెంటనే దానికి సంబంధించిన పరికరాలను వ్యాన్లో లోడ్ చేసుకొని ప్రమాద స్థలానికి వెళ్తాం. ప్రమాదంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ప్రాణాలకు మించి ప్రయత్నిస్తాం. రెస్క్యూ టీం లేకుండా గని ప్రమాదాల్లో కార్మికుల ప్రాణాలు, సంస్థ ఆస్తులను రక్షించడం సాధ్యం కాదు. ప్రమాదాల్లో మా సేవలకు ఎక్కువగా ప్రాధాన్యముంటుంది. అనుగుణంగా పనిచేయడమే ప్రథమ కర్తవ్యం.
– తోట సంపత్, హెడ్ ఓవర్మన్,ఆర్ఆర్ఆర్టీ
అంతర్జాతీయ స్థాయిలో పరికరాలు..
అంతర్జాతీయస్థాయికి తీసిపోని విధంగా యాజమాన్యం రెస్క్యూ పరికరాలను సమకూరుస్తూ వస్తున్నది. బెల్లంపల్లి రీజియన్ పరిధి మందమర్రి ఏరియాలోని రామకృష్ణాపూర్ రెస్క్యూ స్టేషన్ (ఆర్ఆర్ఆర్టీ)ఇన్చార్జిగా పనిచేయడం సంతోషంగా ఉంది. ఇక్కడి రెస్క్యూ బ్రిగ్రేడర్స్, రెస్క్యూ సిబ్బంది మెరికల్లాంటి వారున్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు క్షణాల్లో అక్కడికి చేరుకొని క్షతగాత్రులను, కంపెనీ ఆస్తులను కాపాడుతున్నారు. సిబ్బంది తమ ప్రాణాలను ఫణంగా పెడుతున్నారు.
– జక్కారెడ్డి, రెస్క్యూ స్టేషన్ ఇన్చార్జి, ఆర్ఆర్ఆర్ టీ