50 పడకలతో ఏర్పాటు
మెరుగైన వైద్యసేవలు అందించేందుకు చర్యలు
వరంగల్ చౌరస్తా, మే 28 : కరోనా బారినపడి కో లుకున్న వారిలో వెలుగు చూస్తున్న బ్లాక్ ఫంగస్ సమస్యను ఎదుర్కొంటున్నవారికి వైద్యసేవలు అందించేందుకు ఎంజీఎం అధికారులు చర్యలు ప్రారంభించారు. దీర్ఘకాలికంగా మధుమేహంతో బాధపడుతూ కరోనా బారినపడి బ్లాక్ ఫంగస్తో ఇబ్బంది పడుతున్న వారికి మెరుగైన వైద్యసేవలందించేందుకు ప్రత్యేకంగా వార్డును ఏర్పాటు చేస్తున్నట్లు ఎంజీఎం వైద్యాధికారులు తెలిపారు. కరో నా బాధితులకు ఇస్తున్న ఎక్కువ డోసు మందుల మూలంగా శరీరంలో షుగర్ లెవెల్స్ పెరగడంతో బ్లాక్ ఫంగస్ బారిన పడే అవకాశాలున్నాయి. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా బ్లాక్ ఫంగస్ వార్డును న్యూ మెయిల్ సర్జికల్ వార్డులో 50 పడకలతో ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం శుక్రవారం నుంచే చర్యలు మొదలుపెట్టారు. కరోనా వైద్యసేవలపై ఎంజీఎం అకడమిక్ హాల్లో మంత్రి దయాకర్రావు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వివిధ విభాగాధిపతులతో శనివారం సమీక్ష నిర్వహించనున్న సందర్భంగా వార్డును మంత్రి చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. ఈ వార్డును అందుబాటులోకి తేవడంతో ఇక బ్లాక్ ఫంగస్ బాధితులకు ఎంజీఎంలోనే తగిన చికిత్స అందుబాటులోకి రానుంది.