అభివృద్ధిని పక్కకు పెట్టి ఆస్తులు కూడబెట్టుకున్నడు
వాటిని కాపాడుకునేందుకే ఇప్పుడు పదవి నుంచి తప్పుకున్నడు: మంత్రి గంగుల కమలాకర్
హుజూరాబాద్ : మాజీ సీఎం చంద్రబాబునాయుడు ఎలాగైతే తన సొంత మామ ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి సీఎం అయ్యాడో.. అదే ఫార్ములాను అమలు చేయాలని ఈటల చూశారని, కేసీఆర్ను వెన్నుపోటు పొడిచి సీఎం సీట్లో కూర్చోవాలని కుట్రలు పన్నాడని మంత్రి గంగుల కమలాకర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆదివారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం సింగాపూర్లోని కిట్స్ ఆడిటోరియంలో, హుజూరాబాద్ మండల, మున్సిపల్ పరిధిలోని టీఆర్ఎస్ ముఖ్యనాయకులు, ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఎస్సీ, బీస్సీల వద్ద తీసుకున్న భూములను తిరిగి అప్పగించాలని డిమాండ్ చేశా రు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని పిలుపునిచ్చారు. సమైక్యాంధ్రలో అవకాశం వచ్చినా పోలేదని ఈటల చెబుతున్నారని, అంటే ఆనాటి నుంచే ఆంధ్రా నాయకులకు సద్దులు మోసినట్లుగా తెలుస్తుందని దుయ్యబట్టారు. ఆయన్ను ఓడించేందుకు డబ్బులు వెదజల్లుతున్నామని, కుట్రలు పన్నుతున్నామన్న ఆరోపణలను గుడి ముందు ప్రమాణం చేసి నిరూపిస్తావా? అని డిమాండ్ చేశారు. ఐదేండ్ల క్రితమే కేసీఆర్ను విభేదించానని చెప్పిన ఈటలను ఐదు సంవత్సరాల కోసం ఎమ్మెల్యేగా గెలిపిస్తే పోరాటం చేయకుండా వెనుదిరిగిన సైనికుడిగా మిగిలారని ఎద్దేవా చేశారు. అక్రమ ఆస్తులను కాపాడుకునేందుకు పార్టీ, ఎమ్మె ల్యే పదవి నుంచి వైదొలిగి బలవంతంగా నియోజకవర్గ ప్రజలపై ఎన్నికలు రుద్దాడని దుయ్యబట్టారు.
కలిసికట్టుగా పార్టీ అభివృద్ధికి పాటుపడాలి
ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య
అందరూ కలిసికట్టుగా ఉండి పార్టీ అభివృద్ధికి పాటు పడాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య పిలుపునిచ్చారు. ధైర్యంగా ఉండండి.. హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు, నాయకులు, కార్యకర్తలకు సీఎం కేసీఆర్ అండగా ఉన్నారని భరోసా ఇచ్చారు. ఇక నుంచి హుజూరాబాద్ నియోజకవర్గం మీద మంత్రులు ప్రత్యేక దృష్టి సారిస్తారని తెలిపారు. బడుగు బలహీన వర్గాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నదని ఒక్క తెలంగాణ ప్రభుత్వమేనని గుర్తు చేశారు. నాయీ బ్రహ్మణులు, రజకులకు ఉచిత విద్యుత్ అందజేస్తూ రూ.400 కోట్లభారం ప్రభుత్వమే మోస్తున్నదని అన్నారు. తెలంగాణ ఉద్య మం నుంచి హుజూరాబాద్లో టీఆర్ఎస్ పార్టీ గెలిచిందని, రానున్న ఎన్నికల్లో ఏ అభ్యర్థిని పెట్టినా గెలిపించడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, పెద్ది సుదర్శన్రెడ్డి, కరీంనగర్ మేయర్ సునీల్రావు, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్ పాల్గొన్నారు.