నర్సంపేట, మే 13: జిల్లాలో కట్టుదిట్టంగా లాక్డౌన్ కొనసాగుతున్నదని డీసీపీ వెంకటలక్ష్మి అన్నారు. గురువారం ఆమె నర్సంపేట పట్టణంలో లాక్డౌన్ను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పోలీసు ఉన్నతాధికారులకు సూచనలు చేశారు. ప్రజలు కరోనా నిబంధనలు పాటించేలా చర్యలు చేపట్టాలన్నారు. పోలీసులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వర్తిస్తున్నారని, ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు పనులు ముగించుకోవాలని, ఆ తర్వాత ఇండ్లకే పరిమితం కావాలని డీసీపీ కోరారు. మాస్క్ లేకుండా బయట తిరగడం నిషేధమన్నారు. సడలింపు సమయంలో బైక్లపై ఒకరు మాత్రమే వెళ్లాలన్నారు. సరుకులు కొనుగోలు చేసేటప్పుడు భౌతికదూరం పాటించాలన్నారు. ఆమె వెంట నర్సంపేట ఏసీపీ ఫణీందర్, డీఎస్పీ కరుణసాగర్రెడ్డి, ట్రైనీ ఎస్సై, పోలీస్ సిబ్బంది ఉన్నారు.
పటిష్టంగా అమలు
నర్సంపేట పట్టణంలో లాక్డౌన్ పటిష్టంగా అమలవుతున్నది. రెండో రోజు ప్రజలు ఉదయం పది గంటల తర్వాత ఇండ్లకే పరిమితమయ్యారు. సడలింపు సమయంలో ప్రజలు డబుల్ మాస్కులు ధరించి బయటకు వస్తున్నారు. శానిటైజర్తో చేతులను శుభ్రం చేసుకుంటూ భౌతికదూరం పాటిస్తున్నారు. కాగా, కూరగాయల మార్కెట్లో లాక్డౌన్ సమయం దగ్గర పడడంతో గురువారం ప్రజలు ఒక్కసారిగా గుమికూడడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇండ్లకు పంపించారు. వాహనాలను ఆపి కౌన్సెలింగ్ ఇచ్చారు. నర్సంపేటలో లాక్డౌన్ను ఏసీపీ ఫణీందర్, డీఎస్పీ కరుణసాగర్రెడ్డి ఎస్సైలతో కలిసి పర్యవేక్షించారు.
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు
పరకాల: లాక్డౌన్ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఏసీపీ పీ శ్రీనివాస్ హెచ్చరించారు. పట్టణంలోని ప్రధాన రహదారి, కూరగాయల మార్కెట్ ఆవరణలో మున్సిపల్ కమిషనర్ తిరునహరి శేషాంజన్స్వామితో కలిసి లాక్డౌన్ను పర్యవేక్షించారు. లాక్డౌన్ సమయంలో ప్రజలు రోడ్లపైకి రావొద్దన్నారు. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు నిబంధనలు పాటిస్తూ నిత్యావసర సరుకులు కొనుగోలు చేసుకోవాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ షాపుల నిర్వాహకులు కొవిడ్ నిబంధనలు పాటించాలన్నారు. వారి వెంట సీఐ మహేందర్రెడ్డి ఉన్నారు.
వర్ధన్నపేట: లాక్డౌన్ నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని వర్ధన్నపేట సీఐ విశ్వేశ్వర్ హెచ్చరించారు. మండలకేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో జాతీయ రహదారిపై ఉదయం 10 గంటల తర్వాత మున్సిపల్ కమిషనర్ జీ రవీందర్తో కలిసి వాహనాలను తనిఖీ చేశారు. అనవసరంగా బయటకు వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట ఎస్సై వంశీకృష్ణ, ట్రైనీ ఎస్సై గంగ ఉన్నారు.
దామెర: మండలంలో ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యారు. 10 గంటల తర్వాత దామెర, కోగిల్వాయి, పులుకుర్తి, ఊరుగొండ తదితర గ్రామాలు నిర్మానుష్యంగా మారాయి. ఓగ్లాపూర్ సైలానీబాబా దర్గా వద్ద తహసీల్దార్ రియాజొద్దీన్, ఎస్సై భాస్కర్రెడ్డి వాహనాలను తనిఖీ చేశారు.
నిబంధనలు పాటించడం మన విధి
రాయపర్తి: లాక్డౌన్ నిబంధనలు పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని వర్ధన్నపేట ఏసీపీ గొల్ల రమేశ్ సూచించారు. మండలకేంద్రంలోని వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై స్థానిక రాజీవ్ చౌరస్తా, బస్టాండ్ సెంటర్, పెర్కవేడు కూడలిలో ట్రైనీ ఎస్సై వొడ్నాల శ్రీలత నేతృత్వంలో నిర్వహిస్తున్న పోలీస్ పహారా, లాక్డౌన్ను తహసీల్దార్ కుసుమ సత్యనారాయణతో కలిసి ఆయన పర్యవేక్షించారు. నిబంధలు ఉల్లంఘించే వారిపై కేసులు నమోదు చేస్తామని ఏసీపీ హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఎస్సై సదయ్య, సిబ్బంది ఎడ్ల రవీందర్, కత్తుల శ్రీనివాస్, మరుపల్ల అన్వేశ్కుమార్, గొళ్లెన రమేశ్, బొట్ల రాజు, చొల్లెటి హర్షిత, పూర్ణచందర్రెడ్డి పాల్గొన్నారు.
శాయంపేట: మండలంలో వ్యాపార, వాణిజ్య సంస్థలు, దుకాణాలు, హోటళ్లు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి. ఉదయం 10 గంటల్లోపే ప్రజలు నిత్యావసర సరుకులను కొనుగోలు చేసి ఇండ్లకు వెళ్తున్నారు. సీఐ తోగిటి రమేశ్కుమార్, ఎస్సై అకినపెల్లి ప్రవీణ్కుమార్ గ్రామాల్లో లాక్డౌన్ను పర్యవేక్షిస్తున్నారు. మాందారిపేట స్టేజీ, శాయంపేటలో బందోబస్తు నిర్వహిస్తూ వాహనాలను తనిఖీ చేస్తున్నారు. అనవసరంగా బయటకు వచ్చే వాహనదారులకు ఫైన్ వేస్తున్నారు.
చెన్నారావుపేట: మండలంలో లాక్డౌన్ పకడ్బందీగా అమలయ్యేలా ఎస్సై శీలం రవి చర్యలు చేపట్టారు. లాక్డౌన్ సమయంలో బయటకు వచ్చిన వారికి ట్రైనీ ఎస్సై మహేందర్ జరిమానా విధించారు. ఎస్సై రవి ఆధ్వర్యంలో సిబ్బంది టీంల వారీగా ప్రతి గ్రామాన్ని సందర్శించి లాక్డౌన్ను కఠినతరం చేశారు. వారి వెంట కానిస్టేబుళ్లు తిరుపతి, రామకృష్ణ, ఉపేందర్ ఉన్నారు.
గీసుగొండ: విధిగా నిబంధనలు పాటించాలని సీఐ రాయల వెంకటేశ్వర్లు అన్నారు. అతిక్రమించి ఎవరైనా రోడ్లపైకి వచ్చినా, లాక్డౌన్ సమయంలో షాపులు తెలిచినా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. పోలీసులు గ్రామాల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. గురువారం ఉదయం 6 గంటలకు షాపులు తెరిచిన నిర్వాహకులు పది గంటలకే మూసివేశారు.