కరోనా పేషంట్లతో ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి
భూపాలపల్లి సింగరేణి ఏరియా హాస్పిటల్ సందర్శన
నేత్ర, పిల్లల వైద్య నిపుణులను నియమించాలని ఫోన్లో సీఎండీని కోరిన గండ్ర
దవాఖాన విస్తరణకు ప్రతిపాదనలు పంపాలని అధికారులకు ఆదేశం
భూపాలపల్లి, జూన్ 9 : కరోనా వచ్చిందని భయపడొద్దు.. ధైర్యంగా ఉండండి.. మేమున్నా’మంటూ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కొవిడ్ బాధితుకు భరోసా ఇచ్చారు. బుధవారం భూపాలపల్లిలోని సింగరేణి ఏరియా హాస్పిటల్ను ఆయన సందర్శించారు. కొవిడ్ వార్డులో చికిత్స పొందుతున్న రోగుల వద్దకు వెళ్లి అక్కడ అందుతున్న వైద్యం, భోజనం గురించి ఆరా తీయగా బాగుందంటూ వారు బదులిచ్చారు. అ తర్వాత వంటశాలలోని ఆహార పదార్థాలను పరిశీలించారు. అనంతరం కొత్తగా నిర్మిస్తున్న ఆక్సిజన్ ప్లాంట్ను పరిశీలించి అధికారులను వివరాలను అడిగి తెలుసుకున్నారు.
దవాఖానలో అన్ని విభాగాల డాక్టర్లతో మాట్లాడారు. ఆ తర్వాత సింగరేణి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి సీటీ స్కాన్, డయాలసిస్ పరికరాలను అందుబాటులోకి తీసుకరావాలని సూచించారు. దవాఖానలో పిల్లలు, నేత్ర వైద్య నిపుణులు కొరత ఉందని తెలుసుకున్న ఎమ్మెల్యే గండ్ర.. వెంటనే సీ అండ్ ఎండీ ఎన్.శ్రీధర్కు ఫోన్ చేశారు. వైద్య నిపుణులతో పాటు, పిల్లల ప్రత్యేక వార్డు ఏర్పాటు చేయాలని, చనిపోయిన వారిని తీసుకెళ్లేందుకు ప్రత్యేక వాహనం సమకూర్చాలని కోరగా, ఆయన సానుకూలంగా స్పందించారు. అలాగే భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఏరియా దవాఖానను విస్తరించేందుకు ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఎమ్మెల్యే గండ్ర ఆదేశించారు. ఇక్కడ భూపాలపల్లి ఏరియా సింగరేణి జీఎం టీ శ్రీనివాసరావు, ఎస్వోటూ జీఎం విజయప్రసాద్, డీవై సీఎంవో పద్మజ, మున్సిపల్ చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణి, వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు కొక్కుల తిరుపతి, నాయకులు రత్నం సమ్మిరెడ్డి, తుమ్మెటి రఘోత్తంరెడ్డి, జక్కిరెడ్డి, బడితల సమ్మయ్య, టీఆర్ఎస్ నాయకులు క్యాతరాజు సాంబమూర్తి, మం దల విద్యాసాగర్రెడ్డి, బుర్ర రమేశ్, కౌన్సిలర్లు సమ్మయ్య, శ్రీనివాస్ ఉన్నారు.