నర్సంపేట, మే 9: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే వ్యాధులు దరిచేరవని నర్సంపేట మున్సిపల్ కమిషనర్ విద్యాధర్ అన్నారు. ఆదివారం ఆయన పట్టణంలోని పలు వార్డుల్లో జరుగుతున్న పారిశుధ్య పనులు, రసాయనాల పిచికారీని పరిశీలించారు. కరోనా కట్టడిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. వ్యర్థాలను పరిసరాల్లో ఎట్టి పరిస్థితిలోనూ వేయొద్దని విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ సిబ్బందితో వీధుల్లో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు.
నర్సంపేట రూరల్: మండలంలోని ఇటుకాలపల్లి, రాములునాయక్తండా, పర్శనాయక్తండా, రాజుపేట, ముత్తోజిపేట, గురిజాల, చిన్నగురిజాలలో గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో జీపీ సిబ్బంది సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. సర్పంచ్లు మండల రవీందర్, అజ్మీరా మాధవి, బానోత్ గాంధీ, శ్రీనివాస్రెడ్డి, దస్రూ, మమత, సుజాత పనులను పరిశీలించారు. అలాగే, నాగుర్లపల్లి, పాతముగ్ధుంపురం, గురిజాల, మహేశ్వరం, రాములునాయక్తండా, దాసరిపల్లి, కమ్మపల్లిలో జీపీ సిబ్బంది పారిశుధ్య పనులు చేశారు. రోడ్లను శుభ్రం చేసి, డ్రైనేజీల్లోని చెత్తాచెదారాన్ని తొలగించారు.
దుగ్గొండి: శివాజీనగర్ సర్పంచ్ లింగంపల్లి ఉమారవీందర్రావు గ్రామంలోని వీధుల్లో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. కరోనా నియంత్రణకు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కార్యదర్శి వల్లె వినోద్కుమార్, బోళ్ల కుమారస్వామి పాల్గొన్నారు.
శాయంపేట: పత్తిపాకలో కార్యదర్శి అలీ బ్లీచింగ్ పౌడర్ను ట్రాక్టర్లో పోసి అన్ని వీధుల్లో చల్లించారు. కరోనా నివారణకు ప్రజలు సహకరించాలని కోరారు. గ్రామంలో బెల్ట్షాపులు మూసివేయాలని నోటీసులు జారీ చేశారు.
గీసుగొండ: గ్రేటర్ వరంగల్ పరిధిలోని 15వ డివిజన్ మొగిలిచర్లలో ఆదివారం కార్పొరేటర్ ఆకులపల్లి మనోహర్ ఆధ్వర్యంలో రసాయనాలు పిచికారీ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు అత్యవసరమైతేనే నిబంధనలు పాటిస్తూ బయటకు రావాలని కోరారు.