ప్రేమజంటను అటకాయించి దారుణం
యువకుడిని బెదిరించి.. యువతిపై అఘాయిత్యం
బైక్పై ఎత్తుకెళ్లి లైంగికదాడి
నిందితుల అరెస్ట్
తాడ్వాయిలో ఆలస్యంగా వెలుగులోకి ఘటన
తాడ్వాయి, ఏప్రిల్ 3 : ప్రియుడితో కలిసి అటవీ ప్రాంతానికి వెళ్లిన ఓ యువతిపై ఇద్దరు మృగాళ్లు అకృత్యానికి ఒడిగట్టారు. యువకుడిని బెదిరించి కొట్టి యువతిని బ్లాక్మెయిల్ చేసి బైక్పై లాక్కెళ్లి లైంగికదాడికి పాల్పడ్డారు. ములుగు జిల్లా తాడ్వాయిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా, నిందితు లు ఇద్దరిని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. తాడ్వాయి పోలీస్స్టేషన్లో పస్రా సీఐ అనుముల శ్రీనివాస్ వెల్లడించిన వివరాల మేరకు.. మార్చి 30న ములుగు జిల్లాలోని ఓ ప్రాంతానికి చెందిన యువతి, యువకుడు తాడ్వాయి మండలంలోని బ్లాక్ బెర్రీ ఐలాండ్ వద్దకు వెళ్తుండగా వారిని కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడేనికి చెందిన కోల సాత్విక్ అలియాస్ సైదులు, జనగం అనందరా వు దురుద్దేశపూర్వంగా వెంబడించారు. జంటను అటకాయించి ఆపారు. సాత్విక్ తాను ఓ పత్రిక విలేకరినని, ఆనందరావు ఫారెస్టు బీట్ ఆఫీసర్నని అబద్ధం చెప్పి బెదిరించారు. ‘మీరు ఇక్కడికి రావాల్సిన పనేమిటి.. తాడ్వాయి పోలీస్స్టేషన్కు పదండి” అని బెదిరిస్తూ వారి వద్ద ఉన్న సెల్ఫోన్లు లాక్కున్నారు. యువకుడికి చెందిన బైక్ టైర్లో గాలి తీసి కొట్టారు. తర్వాత పోలీస్స్టేషన్లో తమకు మీటింగ్ ఉందని, ఏటూరునాగారం పోలీస్స్టేషన్కు వెళ్లాలని యువతిని ఒక్కదాన్నే బలవంతంగా ఏటూరునాగారం తీసుకెళ్లారు. అక్కడి నుంచి మణుగూరులోని ఆనందరావు రూముకు తీసుకెళ్లారు. సాత్విక్ భోజనం తీసుకురమ్మని ఆనందరావుకు చెప్పి బయటకు పంపించి యువతిపై లైంగిదాడి చేశాడు. తర్వాత భోజనం తీసుకొచ్చిన ఆనందరావు సైతం యువతిపై లైంగికదాడికి ఒడిగట్టాడు.
తాడ్వాయిలో ఉండిపోయిన యువకుడు తన బైక్లో గాలి కొట్టించుకొని ఇంటికి వెళ్లాడు. లైంగికదాడికి గురైన యువతికి తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె స్వగ్రామం వివరాలు తెలుసుకున్న సాత్విక్ ఇంటి వద్ద దించి రావాలని ఆనందరావుతో పంపించాడు. విషయాన్ని ఇంట్లో తెలియనివ్వకుండా మనోవేదనకు గురవుతున్న యువతిని మరుసటి రోజు నుంచి నిందితులు తరుచూ ఫోన్ చేస్తూ మళ్లీ రావాలని, లేదంటే యువకుడితో బ్లాక్బెర్రీ ఐలాండ్ వెళ్లిన విషయాన్ని ఇంట్లో చెబుతామని వేధించారు. యువతి విషయాన్ని యువకుడికి ఫోన్లో వివరించింది. యువకుడు త మకు జరిగిన అన్యాయంపై తాడ్వాయి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ వి షయం తెలిసి నిందితులు పరారయ్యారు. పస్రా సీఐ, తాడ్వాయి ఎస్ఐ వెంకటేశ్వర్రావు గాలింపు చేపట్టారు. నిందితులు శనివారం హైదరాబాద్కు పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా కాటాపురం క్రాస్ రోడ్డు వద్ద పట్టుబడ్డారు.
సమాచారం ఇవ్వండి..
తాడ్వాయి, పస్రా మండలాల్లోని పర్యాటక ప్రాంతాలకు వచ్చే పర్యాటకుల ను ఎవరైనా ఇబ్బంది పెట్టినా, బ్లాక్మెయిల్ చేసినా సమాచారం ఇవ్వాలని సీఐ శ్రీనివాస్ సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచి బ్లాక్మెయిల్కు పాల్పడిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.