అధికారులు టీం వర్క్గా పనిచేయాలి
ధాన్యం కొనుగోలు ప్రక్రియకు ఆంక్షల్లేవు
హమాలీలు, అధికారులకు పాసులిస్తాం
ఉపాధి పనులను కొనసాగించాలి
లాక్డౌన్పై గూగుల్ మీట్లో కలెక్టర్
వరంగల్ రూరల్, మే 12(నమస్తేతెలంగాణ): జిల్లా ప్రజలందరూ లాక్డౌన్ నిబంధనలు విధిగా పాటించాలని కలెక్టర్ ఎం హరిత అన్నారు. వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు టీం వర్క్గా పని చేసి జిల్లాలో లాక్డౌన్ ప్రశాంతంగా అమలు జరిగేలా కృషి చేయాలని సూచించారు. బుధవారం ఆమె తన కార్యాలయంలోని చాంబర్ నుంచి గూగుల్ మీట్ ద్వారా మాట్లాడారు. అదనపు కలెక్టర్ హరిసింగ్, ఆర్డీవోలు మహేందర్జీ, పవన్కుమార్తో పాటు తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపాలిటీల కమిషనర్లకు పలు సూచనలు చేశారు. యాసంగి ధాన్యం కొనుగోలు ప్రక్రియకు ఎలాంటి ఆంక్షలు లేవన్నారు. అకాలవర్షం కురుస్తున్నందున ధాన్యం తడువకుండా సరిపడా టార్పాలిన్లను సమకూర్చుకోవాలని ఆదేశించారు. రైతులకు టోకెన్లు పంపిణీ చేయాలని చెప్పారు. హమాలీలు, అధికారులకు పాసులు ఇవ్వనున్నట్లు తెలిపారు. కొనుగోలు కేంద్రాలకు ఇన్చార్జిలుగా వ్యవహరిస్తున్న అధికారులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని అన్నారు. ఉపాధి పనులను కూడా ఎలాంటి ఆటంకం లేకుండా కరోనా నిబంధనలు పాటిస్తూ చేయించాలని ఆదేశించారు. గ్రామాల్లో శానిటేషన్ వర్కర్స్ తప్పక అటెండ్ కావాలని, హైడ్రోక్లోరైట్ను స్ప్రే చేయించాలని, పది రోజుల పాటు జిల్లా ప్రజలందరూ లాక్డౌన్కు సహకరిస్తే కరోనా వైరస్ బారిన పడే వారి సంఖ్య తప్పకుండా తగ్గుతుందని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఐపొలేషన్ కేంద్రాలు..
పరకాలలోని మల్లక్కపేట బాలికల గురుకుల పాఠశాలలో 80, నర్సంపేటలోని ఎస్సీ సంక్షేమ హాస్టల్లో 100, వర్ధన్నపేటలోని బీసీ హాస్టల్లో 40 బెడ్స్తో ఐసొలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ హరిత తెలిపారు. తహసీల్దార్లు ఎప్పటికప్పుడు వీటిని విజిట్ చేసి కరోనా బారిన పడిన వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఒక్కో ఐసొలేషన్ కేంద్రంలో 12 మందితో కూడిక మెడికల్ టీంను నియమించామని, షిప్ట్ల వారీగా పని చేస్తారని తెలిపారు. వైరస్ బారిన పడిన వారికి అవసరమైన వైద్యంతోపాటు ఆహారాన్ని కూడా టైం ప్రకారం ఈ ఐసొలేషన్ కేంద్రాల్లో ఇస్తారని చెప్పారు. పరకాలలోని కరోనా కేర్ సెంటర్లో ఏర్పాటు చేసిన టెలీ మెడిసిన్ సెంటర్ 7093772394కు ప్రజలు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫోన్ చేసి తమ సమస్యలు తెలియజేయడం ద్వారా ట్రీట్మెంటు పొందాలని కలెక్టర్ అన్నారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం నంబరు 18004253424కు ఫోన్ చేసి కరోనాకు సంబంధించిన సమస్యలు తెలిపి వెంటనే పరిష్కారం పొందాలని ఆమె ప్రజలకు సూచించారు.