జయశంకర్ భూపాలపల్లి : దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా రైతుల కోసం రైతుబంధు, రైతు బీమా, 24 గంటల విద్యుత్ అందిస్తూ సీఎం కేసీఆర్ రైతు బాంధవుడిగా మారాడని పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత అన్నారు. జిల్లాలోని కాటారం మండల కేంద్రంలో రూ.22 లక్షల వ్యయంతో నిర్మించిన రైతు వేదిక భవనాన్ని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధుతో కలిసి శుక్రవారం ఎంపీ ప్రారంభించారు.
కాటారం నుంచి విలాసాగర్ వరకు రూ.10 కోట్లతో నిర్మించనున్న రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఎంపీ వెంకటేష్ నేత మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా సీఎం కేసీఆర్ దళితులను ఉన్నతి కోసం దళిత బంధు పథకం ప్రవేశపెట్టారన్నారు. దీనిపై విమర్శలు చేయడం అవివేకమన్నారు.
సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే దళితులను ఉన్నత స్థాయిలోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో దళిత క్రాంతి పథకానికి శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. దళితులు ఆర్థికంగా ఎదగాలన్న సంకల్పంతో దళిత బంధు పథకం తీసుకువస్తే ఎన్నికల కోసమే ప్రవేశపెట్టాలంటూ మాట్లాడటం సిగ్గుచేటన్నారు.
కరోనా సంక్షోభ సమయంలోనూ ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేసి అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలిచామన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై కక్షసాధింపు ధోరణి అవలంభిస్తున్నదని విమర్శించారు.