భూపాలపల్లి టౌన్ : భూపాలపల్లి పట్టణ శివారులో బొగ్గుల వాగు సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు ఉప్పుల కుమారస్వామి కాలు విరిగింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. భూపాలపల్లి మండలం కమలాపూర్ గ్రామానికి చెందిన ఉప్పుల కుమారస్వామి తన ద్విచక్ర వాహనంపై వ్యక్తిగత పనిపై భూపాలపల్లికి వచ్చి తిరిగి గ్రామానికి వెళ్తున్నాడు. కాగా భూపాలపల్లికి చెందిన ఒక వ్యాపారి కారు (ఏపీ 36 ఏజడ్ 1239) లో కాళేశ్వరంకు వెళ్లి వస్తున్నాడు. ఈ క్రమంలో బొగ్గులవాగు సమీపంలో కారు, బైక్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కుమారస్వామి కుడికాలు విరిగింది. వెంటనే ప్రైవేటు హస్పిటల్లో ప్రథమ చికిత్స చేయించి వరంగల్కు తరలించారు.