జయశంకర్ భూపాలపల్లి : ప్రస్తుతం జరుగుతున్న శీతాకాలపు పార్లమెంట్ సమావేశాలను టీఆర్ఎస్ ఎంపీలు, రాజ్య సభ సభ్యులతో పార్లమెంట్ సమావేశాలను స్థంభింప చేయించి రాష్ట్రంలో యాసంగి వరిధాన్యం కొనుగోలును సాధించి తీరుమతామని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి స్పష్టం చేశారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సొంత ఖర్చులతో వైద్య సేవలను పొందిన 12మందికి రూ. 5. 75లక్షల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లాలో వానకాలం వరి దాన్యాన్ని ఎలాంటి ఆటంకాలు లేకుండ కొనుగోళ్లు చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో ఇప్పటికే 100 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు తెలిపారు.
వరి ధాన్యంలో తేమ శాతం 17కు మించి ఉండరాదని సూచించారు. వానకాలం వరి ధాన్యంను చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఇందులో రైతులు ఎలాంటి అపోహలు, ఆందోళనలకు గురి కావద్దని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.