భూపాలపల్లి టౌన్ : వరికి ప్రత్యామ్నాయంపై రైతులతో చర్చించండి.. అవకాశం ఉన్న చోట ఆరుతడి పంటలు వేసేలా అవగాహన కల్పించాలని ప్రజాప్రతినిధులను, అధికారులకు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సూచించారు. గురువారం భూపాలపల్లి మండలంలో సర్వసభ్య సమావేశం ఎంపీపీ మందల లావణ్యసాగర్రెడ్డి అధ్యక్షతన జరిగింది. సమావేశానికి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్, మంత్రులు ఢిల్లీలో యాసంగిలో ధాన్యం కొనుగోలు విషయంలో చర్చలు జరుపుతున్నారని, యాసంగిలో కేంద్రం ధాన్యం కొనుగోలు చేస్తుందనే నమ్మకం లేదన్నారు. ఈ సంవత్సరం రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని గుర్తు చేశారు.
యాసంగి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయకపోతే రైతులు నష్టపోతారని, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని అవకాశం ఉన్న చోట రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలని కోరారు. అలాగే వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్ఫాం పంట వేసుకోవచ్చని ఆయన సూచించారు. భూపాలపల్లి మండలంలోని పలు గ్రామాలకు ఇంత వరకు మిషన్ భగీరథ నీరు రావడం లేదని, చాలా చోట్ల పైపులైన్ లీకేజీలు ఉన్నాయని సభ్యులు సభ దృష్టికి తీసుకురావడంతో ఎమ్మెల్యే అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కీం ప్రారంభమై మూడేళ్లు గడుస్తున్నా ఇంకా గ్రామాల్లో పనులు పెండింగ్ ఏంటని, వారం రోజుల్లో పనులు పూర్తి చేసి నీరు ఇవ్వకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వం మిషన్ భగీరథను ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిధులు మంజూరు చేస్తుంటే అధికారులు, కాంట్రాక్టర్లు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్టారు.
మండల సమావేశానికి డీఈ రాకపోవడం ఏంటని, డీఈ రాకపోతే ఈఈ రావాలని అన్నారు. గ్రామాల్లో విద్యుత్ అధికారులు నిర్లక్ష్యం కనిపిస్తుందని, స్ట్రీట్ లైట్లకు ఆన్ఆఫ్ స్విచ్లు పెట్టకపోవడం, విరిగిన విద్యుత్ స్తంభాలను సరి చేయకపోవడం ఏంటని ప్రశ్నించారు. స్త్రీనిధి కింద అర్హులైన వారికి గేదెలను ఇవ్వాలని, నాగారంలో గేదెల పంపిణీలో జరిగిన అవకతవకలపై అధికారులు స్పందించి సరి చేయాలని కోరారు. పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు అన్ని పాఠశాలలు తనిఖీ చేసి సౌకర్యాలు మెరుగుపరుచాలని కోరారు. సమావేశంలో ఎంపీడీవో అనిల్కుమార్, తాసిల్దార్ ఇక్భాల్, వైస్ ఎంపీపీ సముద్రాల దీపారాణిశ్రీనివాస్, సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.