భూపాలపల్లి టౌన్ : కేంద్ర ప్రభుత్వం యాసంగిలో ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి లేనందున రైతులు అనువైన చోట ప్రత్యామ్నాయ పంటలు వేసేందుకు ప్రయత్నం చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కోరారు. ఆదివారం భూపాలపల్లి మండలంలోని గొల్లబుద్ధారంలో జంగేడు పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం యాసంగిలో వడ్లు కొనేదిలేదని, వరి పంటలు వేయొద్దని కోరడం సరికాదన్నారు. రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దు ఏడ్చిన ఎవుసం బాగుపడిన దాఖలాలు లేవని, కేంద్రానికి రైతుల గోస తగులుతుందన్నారు. రైతులు మాత్రం సాధ్యమైనంత వరకు వరి పంటను తగ్గించుకోవాలని ఇది డిమాండ్ కాదని రైతుల బాగోగులను దృష్టిలో ఉంచుకుని చెప్పడం జరుగుతుందన్నారు.
కార్యక్రమంలో ఎంపీపీ మందల లావణ్య, జంగేడు పీఏసీఎస్ చైర్మన్ మేకల సంపత్కుమార్ యాదవ్, వైస్ ఎంపీపీ సముద్రాల దీపారాణి శ్రీనివాస్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పిన్రెడ్డి రాజిరెడ్డి, పీఏసీఎస్ మాజీ చైర్మన్ మందల విద్యాసాగర్రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ నాంపెల్లి శ్రీనివాస్, సీఈఓ సల్ల రవీందర్, డైరెక్టర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, డైరెక్టర్లు, నాయకులు పాల్గొన్నారు.