ప్రతి కేంద్రంలో నలుగురికి తగ్గకుండా నిర్వాహకులు
206 కేంద్రాల్లో 824 మంది విధుల నిర్వహణ
జూన్ 15 వరకు పూర్తి కానున్న కొనుగోళ్లు
జయశంకర్ భూపాలపల్లి, మే 25(నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం జిల్లా లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ అధికారుల సమన్వయంతో సజావుగా సాగుతోంది. జిలాల్లో ధాన్యం కొనుగోలు కోసం ఏర్పాటు చేసిన 206 కేంద్రాలను నిర్వహించాలంటే కలెక్టర్, జాయింట్ కలెక్టర్తో పాటు సుమారు తొమ్మిది రకాల శాఖలు సమన్వయంతో పని చేయాల్సి ఉంటుంది. జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి మొత్తం కొనుగోలు కేంద్రాలను పర్యవేక్షిస్తున్నారు. కేంద్రాల ఏర్పాటు నుంచి మొదలుకొని ధాన్యాన్ని మిల్లులకు చేర్చడం వరకు పూర్తిగా పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఈమేరకు యాసంగి వరి ధాన్యం సాఫీగా కొనుగోలు చేయడానికి జిల్లాలోని తొమ్మిది శాఖలు నిరంతరం సమన్వయంతో పనిచేస్తున్నాయి.
ప్రతి కేంద్రానికి నలుగురు..
జిల్లాలో కొనుగోలును సక్రమంగా నిర్వహించడానికి అధికారులు ప్రతి కేంద్రానికి నలుగురిని నియమించారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 206 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ప్రస్తుతం 824 మంది నిరంతరం విధులు నిర్వర్తిస్తున్నారు. ఐకేపీ లాంటి కేంద్రాల్లో మాత్రం గ్రామైక్య సంఘాల భాద్యులు విధులను నిర్వహిస్తున్నారు. జిల్లాలో చేపట్టిన ధా న్యం కొనుగోళ్ల ప్రక్రియ జూన్ 15 వరకు పూర్తి కానున్నట్లు అధికారులు తెలిపారు.
కొనుగోలు కేంద్రాల పరిశీలన
వెంకటాపురం(నూగూరు)/కాటారం : వెంకటాపురం మండల పరిధిలో వీఆర్కే పురం సమీపంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం భూపాలపల్లి జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు పల్ల బుచ్చయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు చేపట్టాలని నిర్వాహకులకు సూచించారు. ఆర్బీఎస్ మండల అధ్యక్షుడు గొర్ల శ్రీను, టీఆర్ఎస్ నాయకులు దామోదర్, పిల్లారసెట్టి మురళి పాల్గొన్నారు. అలాగే, కాటారం మండలంలోని రేగులగూడెంలో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నకొనుగోలు కేంద్రాన్ని తహసీల్దార్ సునీత పరిశీలించారు. లారీల కొరత ఉందని రైతులు తెలుపడంతో వెంటనే కాంట్రాక్టర్తో ఫోన్లో మాట్లాడారు. ధాన్యం రవాణాలో జాప్యం లేకుం డా చూడాలని సూచించారు. ఆమె వెంట ఆర్ఐ భాస్కర్ ఉన్నారు.