భూపాలపల్లి రూరల్ : ప్రమాదాలు జరగకుండా రోడ్ల మరమ్మతులు పూర్తి చేసి ప్రమాద సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాల యంలో ఆయన అధ్యక్షతన జిల్లా స్థాయి రహదారి భద్రత కమిటీ సమావేశం జరిగింది. జిల్లాలో జరిగిన రహదారి ప్రమాదాలపై నేషనల్ హైవే, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ ఇంజినీర్లు, రవాణ, పోలీస్ శాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రతి రోజు ఆరు వేల వాహనాల ద్వారా రవాణ జరుగుతుందని, వర్షకాలం రోడ్డు ప్రమాదాలు అధికంగా జరిగే అవకాశం ఉన్నందున సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉండి రోడ్డు ప్రమాదాలు జరుగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అన్నారు.
పరకాల నుంచి కాళేశ్వరం వరకు జాతీయ రహదారిపై దాదాపు 200గుంతలు ఏర్పడి వాహనాల రవాణాకు చాలా ఇబ్బంది కలుగుతుందని, రెండు నెలల కాలంలో గంతలలో పడి దాదాపు 20మంది వాహన దారులు మరణించారన్నారు. రేపటిలోగా అన్ని గుంతలు పూడ్చివేసి వారంలోగా ప్రమాదాలు జరిగే ప్రాంతాలను సూచిస్తూ సైన్ బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. ఆర్అండ్బీ రోడ్డు నుంచి నేషనల్ హైవే రోడ్డులోకి వెళ్లే చోట స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలన్నారు. భూపాలపల్లి పట్టణం నుంచి చెల్పూర్ వరకు ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ను ఆదేశించారు. కాటారం నుంచి అడవి సోమనపల్లి మానేరు బ్రిడ్జి వరకు అసంపూర్తిగా ఉన్న రహదారి నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని ఆర్అండ్బీ ఈఈ వెంకటేష్ను ఆదేశించారు.
జయశంకర్ భూపాలపల్లి, ములుగు వ్యాప్తంగా దెబ్బతిన్న రోడ్లు, వంతెనలను గుర్తించి మరమ్మతులు చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు. భారీ వాహనాల కొరకు మైలారం, కాటారంలో ప్రత్యేకంగా పార్కింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజలకు ఇబ్బంది కలుగకుండా జిల్లాలోని మారుమూల ప్రాంతాల వరకు బస్సులు నడుపాలని, బస్టాండ్లలోని మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచాలని ఆర్టీసీ డీఎం ధరమ్ సింగ్ను ఆదేశించారు. జిల్లా ఎస్పీ సంగ్రామ్సింగ్ పాటిల్ మాట్లాడుతూ జాతీయ రహదారి పై ప్రమాదాల నివారణ కొరకు జాతీయ రహదారి నిర్వహణ అధికారులు నిబంధనల మేరకు అన్ని వసతులను కల్పించాలన్నారు. రహదారుల వెంబడి అంబులెన్స్లను సిద్ధంగా ఉంచాలని, మరుగుదొడ్లతో కూడిన వాహనాల పార్కింగ్ సౌకర్యాన్ని కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ శ్రీనివాసులు, ఆర్డీవో శ్రీనివాస్, జిల్లా రవాణ శాఖ అధికారి వేణు, నేషనల్ హైవే ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు విద్యాసాగర్, భూపాలపల్లి డీఎస్పీ సంపత్రావు, కలెక్టరేట్ ఏవో మహేష్బాబు, అధికారులు పాల్గొన్నారు.