కలెక్టర్ బీ గోపి,గ్రేటర్ కమిషనర్ ప్రావీణ్య
ఎంజీఎం దవాఖాన తనిఖీ
ఓ సిటీ ఇండోర్ స్టేడియం పరిశీలన
అభివృద్ధి పనులపై ఆరా
వరంగల్ చౌరస్తా, నవంబర్ 26 : వరంగల్ ఎంజీఎం దవాఖానను కలెక్టర్ గోపి గ్రేటర్ కమిషనర్ ప్రావీణ్యతో కలిసి శుక్రవారం సందర్శించారు. దవాఖాన ఆవరణను పరిశుభ్రంగా ఉంచడానికి చేపడుతున్న పారిశుధ్య పనులపై ఎంజీఎం డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ పరశురాం, ఆర్ఎంవో డాక్టర్ మురళిని అడిగి తెలుసుకున్నారు. పారిశుధ్య పనులపై దృష్టిసారించాలని సూచించారు. ఎంజీఎంలో విభాగాల వారీగా అందుతున్న వైద్య సేవలపై చర్చించారు. అనంతరం ఎంజీఎం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కస్తూర్బా సేవాగ్రాం భవనాన్ని పరిశీలించారు. పేద రోగులు, వారి అటెండెంట్లు బస చేయడానికి నెలకొల్పిన సేవాగ్రాం సేవలను మరింత విస్తృతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట కేఎంసీ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రాంకుమార్ రెడ్డి, ఆర్ఎంవో సాంబరాజు, బ్లడ్ బ్యాంక్ ఇన్చార్జి డాక్టర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఇండోర్ స్టేడియం సందర్శన..
కాశీబుగ్గ : నగరంలోని 19వ డివిజన్లో గల ఓసిటీ ఇండోర్ స్టేడియాన్ని కలెక్టర్ గోపి, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్య సందర్శించారు. స్టేడియంలోని షటిల్ బ్యాడ్మింటన్ కోర్టు, స్టేడియం బిల్డింగ్ను పరిశీలించారు. అనంతరం డీవైఎస్వో ఇందిరతో మాట్లాడి స్టేడియం సమస్యలను తెలుసుకున్నారు. చేయాల్సిన అభివృద్ధి పనులపై ఆరా తీశారు.