జనగామ చౌరస్తా, నవంబర్ 26 : జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డు మార్గంలో ఉన్న సెయింట్ మేరీస్ హైస్కూల్లో ఈ నెల 23వ తేది నుండి నిర్వహిస్తున్న పాఠశాల విద్యార్థుల రాష్ట్ర స్థాయి కళా ఉత్సవ్ 2021 పోటీలు శుక్రవారంతో ముగిసినట్లు డీఈవో కే రాము తెలిపారు. చివరి రోజు పోటీల్లో సంప్రదాయ బొ మ్మల తయారీ విభాగంలో దేవరుప్పుల మం డలం ధర్మపురం జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల విద్యార్థిని రవిష్ణ, స్టేషన్ ఘన్పూర్ సెయింట్ మేరీస్ విద్యార్థి అజయ్ దారం, కాగితాలను ఉపయోగించి అందమైన, ఆలోచింపజేసే బొమ్మలు, అలంకరణ వస్తువులను జూమ్ వేదికగా హైదరాబాద్లోని జ్యూరీ సభ్యులు చూస్తుండగా తయారు చేసి ప్రదర్శించడం జరిగిందని డీఈవో రాము పేర్కొన్నారు. అదేవిధంగా జనగామ సె యింట్ మేరీస్ హైస్కూల్ విద్యార్థి జోసెఫ్ ప్రభు కుమార్ వాద్య సంగీత విభాగంలో సాంప్రదాయ డ్రమ్స్తో శ్రావ్యమైన సంగీతాన్ని ప్రదర్శించగా, త్రిమితీయ బొమ్మల ప్రదర్శన విభాగంలో జనగామ మండలం శామీర్పేట జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల విద్యార్థి సాగర్ వినాయక విగ్రహాన్ని తయారుచేసి ప్రదర్శించాడని తెలిపారు. ఈ సందర్భంగా డీఈవో రాము మాట్లాడుతూ ఆయా విభాగాల్లో మెరుగైన ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థుల్లో దాగివున్న నైపుణ్యాలను మరింత మెరుగుపర్చడానికి, కొనసాగించడానికి పాఠశాల యాజమాన్యాలు కృషి చేస్తూ విద్యార్థులను ప్రోత్సహించాలన్నారు. ఈ పోటీల విజేతలను రెండు, మూడు రోజుల్లో జ్యూరీ కమిటీ ప్రకటిస్తుందని, పాల్గొన్న విద్యార్థులందరికి ప్రశంసా పత్రాలు అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారిణి గౌసి యా, సెయింట్ మేరీస్ హైస్కూల్ ప్రిన్సిపాల్ జైమన్ థా మస్, సాంకేతిక సిబ్బంది నవీన్, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.