మూడో విడుత ఫీవర్ సర్వే ప్రారంభం
భూపాలపల్లి జిల్లాలో 400 టీమ్లు
సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి
పీహెచ్సీల్లో అందుబాటులో మందులు
గతంతో పోలిస్తే తగ్గిన కేసులు
ఫలితాలిస్తున్న పల్లె, పట్టణ ప్రగతి, మిషన్ భగీరథ
భూపాలపల్లి టౌన్, జూలై 25 : వర్షాలు విస్తారంగా కురుస్తున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. విషజ్వరాలు ప్రబలకుండా ప్రత్యేక చర్యలు చేపట్టింది. జిల్లాలోని సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించింది. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్లలో మందులు అందుబాటులో ఉంచారు. వీటికి తోడు జిల్లాలోని ఆయా పీహెచ్సీలు, సీహెచ్సీల్లో ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వ్యాధులపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను వైద్యశాఖ అధికారులు ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లతో ఇప్పటికే గ్రామాల్లో ప్రచారం చేస్తూ, మూడో విడుత ఫీవర్ సర్వే ప్రారంభించారు. జిల్లాలో 18 సమస్యాత్మక గ్రామాలను గుర్తించి ముందస్తు చర్యలు చేపట్టారు. ఇప్పటికే 96 గ్రామాల్లో 33 వేల దోమ తెరలను పంపిణీ చేశారు. మలేరియా నిర్ధారణ కిట్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచారు. ఫీవర్ సర్వే ద్వారా అనుమానితులకు మలేరియా, డెంగీ జ్వర నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. గతంతో పోలిస్తే సీజనల్ వ్యాధులు చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. ఇందుకు పల్లె, పట్టణ ప్రగతి, మిషన్ భగీరథ, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం చాలా వరకు ఫలితాలనిచ్చాయనే చెప్పాలి.
ఫీవర్ సర్వేతో వ్యాధులకు చెక్
ఇప్పటికే రెండు విడుతలుగా ప్రభుత్వం ఫీవర్ సర్వే నిర్వహించి వ్యాధులను ముందే గుర్తించి తగిన చికిత్సలు అందించింది. ఈ క్రమంలో కరోనా మహమ్మారిని సైతం సాధ్యమైనంత వరకు ముందే కంట్రోల్ చేసింది. అదే స్ఫూ ర్తితో ప్రస్తుతం సీజనల్ వ్యాధులను ముందే గుర్తించి అరికట్టాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మూడో విడుత ఫీవర్ సర్వే ను ప్రారంభించింది. జిల్లాలోని ఆశ వర్కర్లతో 400 టీమ్లను ఏర్పాటు చేసి సర్వే నిర్వహిస్తుండగా ఏఎన్ఎంలు పర్యవేక్షిస్తూ సీజనల్ వ్యాధులను ఆదిలోనే అరికడుతున్నారు. జిల్లాలోని అంబట్పల్లి లో 15 మలేరియా కేసులను గుర్తించి చికిత్స అందించారు.
సీజనల్ వ్యాధులపై నజర్
సీజనల్ వ్యాధులపై ప్రత్యేక దృష్టి సారించాం. మూడో విడుత ఫీవర్ సర్వే ప్రారంభమైంది. ఈ సర్వేతో వ్యాధులను ముందే గుర్తించి చికిత్సలు అందిస్తున్నాం. జిల్లాలో 400 టీమ్లతో సర్వే చేయిస్తున్నాం. 500 జనాభా ఉన్న ప్రాంతాల్లో 30 మందికి జ్వరాలు వచ్చినట్లు గుర్తిస్తే వైద్య శిబిరం ఏర్పాటు చేస్తాం. కరోనా తగ్గుముఖం పట్టడంతో నాన్ కొవిడ్ చికిత్సలపై దృష్టి పెట్టాం. గతంతో పోలిస్తే కేసులు చాలా తగ్గాయి. పల్లె, పట్టణ ప్రగతి, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, మిషన్ భగీరథ నీరు ఇలా అనేక ప్రభు త్వ కార్యక్రమాలు సత్ఫలితాలనిస్తున్నాయి. మాకు చాలా భారాన్ని తగ్గించాయి. ముఖ్యంగా ఈ సీజన్లో డయేరియా , మలేరియా కేసులు ఎక్కువగా వచ్చేవి. ప్రస్తుతం చాలావరకు తగ్గాయి. హోటళ్లలో వ్యాధి కారక పదార్థాలు, కలుషిత నీరు వ్యాధులు తెచ్చిపెడుతున్నాయి. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తా. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
ఫలితాలనిచ్చిన ప్రభుత్వ పథకాలు
ప్రభుత్వం చేపట్టిన పథకాలు మంచి ఫలితాలనిస్తున్నాయి. ముఖ్యంగా పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమంతో పాటు ఇంటింటా మిషన్ భగీరథ నీరు సీజనల్ వ్యాధులను దూరం చేశాయి. నాలుగు విడుతలుగా పల్లె ప్రగతి, మూడు విడతలుగా పట్టణ ప్రగతి కార్యక్రమాలు పూర్తికాగా, పల్లెలు పరిశుభ్రంగా మారాయి. పట్టణం అద్దంలా మారింది. డ్రైనేజీలను శుభ్రం చేసి శానిటేషన్ చేశారు. దీంతో దోమల లార్వా పోయి సమస్య చాలా వరకు తగ్గింది. మలేరియా, చికున్ గున్యా, డయేరియా వ్యాధులు గతంతో పోలిస్తే తగ్గాయని వైద్యులు చెబుతున్నారు. నాడు గ్రామాల్లో కలుషిత నీరు తాగి డయేరియా బారిన పడేవారు. ప్రస్తుతం ప్రభుత్వం ఇంటింటా మిషన్ భగీరథ నీరు రావడంతో వ్యాధులు దూరమయ్యాయి. అలాగే వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకునేలా ప్రభుత్వం ప్రోత్సహించడం ఒక కారణం అని వైద్యులు చెబుతున్నారు.