భూపాలపల్లి, జనవరి 23 :ఆంగ్ల మాధ్యమంలో బోధన విప్లవాత్మక నిర్ణయం.. పేద విద్యార్థులకు ఎంతో మేలు చేస్తుంది తల్లిదండ్రులకూ నమ్మకం పెరుగుతుంది.. కార్పొరేట్తో పోటీ పడేలా తీర్చిదిద్దవచ్చువంద శాతం విజయవంతం అవుతుంది.. కేసీఆర్ ఆలోచన చాలా గొప్పదంటున్న మేధావులు, విద్యావేత్తలు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరచి, ఆంగ్ల మాధ్యమంలో విద్యనందించేందుకు ‘మన ఊరు-మన బడి’కి శ్రీకారం చుట్టడం మంచి నిర్ణయమంటూ సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఫలితంగా ఎంతోమంది పేద విద్యార్థులకు మేలు జరుగడమే గాక సర్కారు బళ్లపై తల్లిదండ్రులకూ నమ్మకం పెరుగుతుందని మేధావులు, విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడం వల్ల విద్యార్థులు కార్పొరేట్ స్కూళ్లతో పోటీపడే స్థాయికి ఎదుగుతారని.. ఇది నిజంగా గ్రామీణ ప్రాంత విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతుందని చెబుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనల్లోంచి పురుడుపోసుకున్న ఈ కార్యక్రమం తప్పక వంద శాతం విజయవంతం అవుతుందని వారు ధీమా వ్యక్తంచేస్తున్నారు.
కార్పొరేట్ స్కూళ్లతో పోటీపడొచ్చు..
ప్రభుత్వ పాఠశాలల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. సర్కారు బళ్లను బలోపేతం చేసే దిశగా తీసుకురాబోతున్న ‘మన ఊరు-మన బడి’ని ప్రభుత్వం విజయవంతం చేస్తుందని భావిస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా అదనపు తరగతి గదులు, ల్యాబ్లు, టాయ్లెట్లు మౌలిక వసతుల కల్పనతో పాటు విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో బోధన అందుతుంది. తద్వారా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కూడా కార్పొరేట్ పాఠశాలల విద్యార్థులతో పోటీపడగలిగే స్థాయికి ఎదుగుతారు.-యెల్లంకి శ్రీనివాసరావు, బంగ్లాపల్లి యూపీఎస్, మొగుళ్లపల్లి
భూపాలపల్లి, జనవరి 23 : రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన ‘మన ఊరు-మన బడి’ చాలా మంచి కార్యక్రమం. దీని వల్ల పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపడుతాయి. విద్యార్థుల తల్లిదండ్రుల్లో సర్కారు బడులపై నమ్మకం పెరుగుతుంది. అనేక చోట్ల మూత్రశాలలు లేక బాలికలు బడి మానేసిన సందర్భాలున్నాయి. సర్కారు తీసుకున్న తాజా నిర్ణయంతో ఈ సమస్యలన్నీ పరిష్కారం కావడమే గాక ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడం వల్ల పేద విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుంది. అటు ప్రైవేట్ స్కూళ్ల ఆగడాలకు అడ్డుకట్ట వేసినట్లవుతుంది.-పొనుగోటి నళిని, ఎస్.ఏ (ఫిజికల్ సైన్స్), మైలారం ప్రభుత్వ ఉన్నత పాఠశాల, గణపురం
ప్రైవేట్ పాఠశాలలు మూతపడడం ఖాయం..
మడికొండ, జనవరి 23: ధనవంతుల పిల్లలు మాత్రమే చదువుకొనగలిగే ఆంగ్ల విద్యను నేడు రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ బడుల్లో ‘మన ఊరు-మన బడి’ పేరుతో ప్రవేశపెడితే విప్లవాత్మక మార్పులు వస్తాయి. ఈ నిర్ణయం సర్వత్రా ఆహ్వానించదగినది. పేద, ధనిక తారతమ్యాన్ని తగ్గించడం ఒక విద్య వల్లనే సాధ్యపడుతుంది. రాష్ట్రవ్యాప్తంగా 26వేల ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ బోధనకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించినట్లయితే ప్రభుత్వ బడులు ప్రైవేటు పాఠశాలలతో పోటీపడతాయి. పట్టణాల్లోనే కాకుండా పల్లెల్లో సైతం పేద విద్యార్థులు ఇంగ్లిషు విద్య చదవడం గొప్ప పరిణామం. సార్వత్రిక ఆంగ్ల విద్య సాకారం కావాలని ఉపాధ్యాయ సంఘాలు, ప్రజా సంఘాలు, యువజన సంఘాలు దశాబ్దాల కాలంగా ప్రభుత్వాలపై డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యమ నాయకుడు, సీఎం కేసీఆర్ కేజీ టు పీజీ నాణ్యమైన విద్యను అందిస్తామని చెప్పారు. అయితే ఎంట్రెన్స్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వి ద్యార్థులకు గురుకులాల్లో మాత్రమే ఈ అవకాశం దక్కింది. కానీ ఇప్పుడు అన్ని పాఠశాలల్లో విద్యార్థులు ఆంగ్ల మాధ్యమంలో చదివే వీలుంటుంది. మన ఊరు-మన బడిలో భాగంగా ఇంగ్లిష్ బోధనకు మౌలిక సదుపాయాలు తోడైతే ప్రైవేట్ పాఠశాలలతో పోటీ పరిస్థితి నెలకొంటుంది. ఉన్న భవనాలకు మరమ్మతులు, కొత్త భవనాలు నిర్మించడం, మరుగుదొడ్లు నిర్మించడం, ఆహ్లాదం కలిగించే ప్రాంగణాలుగా అభివృద్ధి చేయడం, స్వచ్ఛమైన తాగునీటి వసతి కల్పించడం, కంప్యూటర్ విద్యను ప్రవేశపెట్టడం, గది గోడలపై విజ్ఞానాన్ని పెంపొందించే చిత్రాలు, డిజిటల్ తరగతులు, సుశిక్షతులైన ఉపాధ్యాయుల నియామకం వంటివి అభివృద్ధి చేస్తే ప్రైవేట్ పాఠశాలలు మూతపడడం ఖాయం. గత మూడేళ్లుగా కరోనా వల్ల దేశంలో 84శాతం మంది ప్రజల ఆదాయం తగ్గిపోయిందని ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. దీని వల్ల ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజలు చెల్లించలేక తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అదునుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల బోధన ప్రారంభిస్తే విద్యార్థులు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. రెసిడెన్షియల్ విద్యను మరింత పటిష్ట పరుస్తూనే గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ అనుబంధ పనులు చేసుకుంటూ తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉం టూ చదువుకుంటున్న విద్యార్థులకు ఈ విద్యాబోధన ఉపయోగపడుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో ఉద్యోగాల కోసం పోటీపడాలంటే ఇంగ్లిష్ అవసరం. ప్రభుత్వ నిర్ణయాన్ని మనమందరం మనస్ఫూర్తిగా ఆహ్వానిద్దాం. సుశిక్షుతులైన ఉపాధ్యాయులను నియమించి నిరంతరం వృత్తి పరమైన శిక్షణ ఇవ్వడం, ఒత్తిడి లేని వాతావరణం కల్పించడం వల్ల ప్రభుత్వం అనుకున్న లక్ష్యాన్ని చేరుకుని తప్పక విజయం సాధిస్తుంది.