ములుగు, అక్టోబర్22(నమస్తేతెలంగాణ)/ ములుగుటౌన్ : పోడు భూములకు శాశ్వత పరిష్కారం చూపేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసిందని, ఆ దిశగా అటవీ, రెవెన్యూ, గిరిజన సంక్షేమ శాఖ అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని రాష్ట్ర అటవీ శాఖ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సూచించారు. శుక్రవారం ఆమె గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినాచోంగ్తూ, సీఎం ఓఎస్డీ ప్రియాంకవర్గీస్, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్(పీసీసీఎఫ్) శోభ, అదనపు పీసీసీఎఫ్ మోహన్చంద్రతో కలిసి ప్రత్యేక హెలిక్యాప్టర్ ద్వారా ములుగు జిల్లాకు వచ్చారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో ములుగు, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో పోడు భూముల సమస్యలు, అడవుల పరిరక్షణ, హరితహారం అంశాలపై ఆయా జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, అటవీ శాఖ అధికారులు, డీఎఫ్వోలు, రెవెన్యూ , గిరిజన సంక్షేమ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శాంతికుమారి మాట్లాడుతూ.. అటవీ భూములను పరిరక్షించాల్సిన బాధ్యత అధికారులదేనని అన్నారు.
4 జిల్లాల్లో అటవీ విస్తీర్ణం ఎక్కువగా ఉందని, ఇక నుంచి ఎకరం అటవీ ప్రాంతం కూడా ఆక్రమణకు గురికాకుండా చూడాలన్నారు. ఇప్పటికే పోడు వ్యవసాయం చేసుకుంటున్న వారికి గతంలో ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు జారీ చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం ఇంకా ఎంత మందికి, ఎన్ని ఎకరాలకు పట్టాలు అందించాలనే విషయంపై సమగ్ర సమాచారాన్ని సేకరించాలని అన్నా రు. పోడు సాగుదారులకు న్యాయం చేయాలనే అంశంపై సీఎం కేసీఆర్ ఆలోచన చేస్తున్నారని, అందుకనుగుణం గా చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. గిరిజన సం క్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా చోంగ్తూ మాట్లాడుతూ.. అడవుల సంరక్షణ, హరితహారం విషయాలపై ఆర్వోఎఫ్ఆర్ చట్టంలో ఉన్న అంశాలను తూచ తప్పకుండా పా టించాలని అన్నారు.
సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ మా ట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆకాంక్ష మేరకు పోడు భూ ముల విషయంలో ప్రజలను ఇబ్బందులకు గురిచేయవద్దన్నారు. వారికి నచ్చజెప్పి జీవనోపాధికి ఇబ్బందులు లేకుండా పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. ఈ సమావేశంలో ములుగు, భూపాలపల్లి, వరంగల్, మహబూబాబాద్ కలెక్టర్లు కృష్ణ ఆదిత్య, గోపి, శశాంక, ఆయా జిల్లాల అధికారులు పాల్గొన్నారు.