రాష్ట్రంలో విజయవంతంగా కొనసాగుతున్న జ్వర సర్వే
వైద్యసిబ్బందికి ప్రజలు సహకరించాలి
మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
పాలకుర్తి, లింగాలఘనపురంలో సర్వే పరిశీలన
పాలకుర్తి రూరల్/లింగాలఘనపురం, జనవరి 22 : ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా ముందుకు సాగుతున్న రాష్ట్ర సర్కారు కరోనా, ఒమిక్రాన్ వైరస్ కట్టడికి సమరశంఖం పూరించిందని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి నీటి సరఫరాల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. శనివారం ఆయన జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని తొర్రూరు జే, శాతాపురం గ్రామాల్లో జ్వర సర్వేను పరిశీలించారు. సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయం, బమ్మెర శివారులోని ఆలేటి ఎల్లవ్వ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. లింగాలఘనపురం మండలం కుందారం గ్రామంలో జ్వర సర్వేలో పాల్గొని, ప్రజల ఆరోగ్య స్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ ప్రస్తుతం థర్డ్వేవ్ ప్రపంచాన్ని వణిస్తున్నదని, తెలంగాణలో థర్డ్వేవే కాదు.. ఇంకా ఎన్ని వేవ్లొచ్చినా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండేందుకు ప్రభుత్వం ఎంతఖర్చుకైనా వెనుకాడదన్నారు. కరోనా విజృంభన కాస్తా ఎక్కువగా ఉన్నా, తీవ్రత తక్కువగా ఉందన్నారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో స్వచ్ఛ తెలంగాణ సాధ్యమైందన్నారు. జ్వరసర్వేలో భాగంగా వైద్య సిబ్బంది ఇంటింటికీ వచ్చి ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తారని చెప్పారు. అనారోగ్యంగా ఉంటే వెంటనే మందుల కిట్లు అందజేస్తారని అన్నారు. సర్వేకు ప్రజలకు సహకరించాలని కోరారు. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా ప్రభుత్వ వైద్యశాలల్లో సకల సౌకర్యాలు కల్పించినట్లు చెప్పారు. ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేశామన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కు లు ధరించి భౌతిక దూరం పాటించాలన్నారు. జ్వరం, ఒళ్లు నొప్పులు, దగ్గు ఉన్నవారు పరీక్ష చేయించుకోవాలని సూచించారు. పాలకుర్తిలో ఎంపీపీ నల్లానాగిరెడ్డి, జడ్పీటీసీ పుస్కూరి శ్రీనివాసరావు, రైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్ యాకాంతారావు, మండల అధ్యక్షుడు పసునూరి నవీన్, వర్రె వెంకన్న, సర్పంచ్ మల్లారెడ్డి, పసులాది సుశీలావెంకటేశ్, ధరావత్ బాలూనాయక్, సంతోష్కుమార్, గజ్జి సంతోష్, పసుల వెంకటేశ్, సాయి, వాసూనాయక్, యాకయ్య, శివరాత్రి సుధాకర్, లింగాలఘనపురంలో నాయకులు లొక్కుంట్ల ఆగరాజు, వంగ నాగరాజు, కృష్ణ, గుగ్గిళ్ల నాగరాజు, రజిత, ఏఎన్ఎం రాజ్యలక్ష్మి, పంచాయితీ కార్యదర్శి సౌజన్య, వీఆర్ఏ భాస్కర్, ఐలయ్య, ఆశ కార్యకర్తలు జయ, గీత, అనసూయ, నాగమణి పాల్గొన్నారు.