మంత్రి కొప్పుల, సీఎస్ సోమేశ్కుమార్
‘దళితబంధు’పై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్
భూపాలపల్లి రూరల్, జనవరి 22 : దళితబంధు లబ్ధిదారులను అసెంబ్లీ నియోజకవర్గానికి వంద మంది చొప్పున ఎంపిక చేయాలని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. శనివారం వారు హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. నియోజకవర్గానికి వంద మంది చొప్పున ఈ ఆర్థిక సంవత్సరంలోనే లబ్ధిచేకూర్చాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఫిబ్రవరి 5వ తేదీలోగా లబ్ధిదారులను ఎంపిక చేయాలని, మార్చి 7వ తేదీలోగా వారికి లబ్ధిచేకూరేలా చర్యలు చేపట్టాలని చెప్పారు. కలెక్టర్ భవేశ్మిశ్రా మాట్లాడుతూ దళితబంధుపై ఇప్పటికే జిల్లాలోని ఇద్దరు ఎమ్మెల్యేలతో చర్చించినట్లు తెలిపారు. అదనపు కలెక్టర్ టీఎస్ దివాకర, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ వెంకటేశ్వర్లు, డీఆర్డీ వో పురుషోత్తం, డీపీవో ఆశాలత, పాల్గొన్నారు.
కోరిన యూనిట్ ఎంపిక చేయాలి
ములుగు టౌన్ : దళిత బంధు పథకంలో లబ్ధిదారుడు కోరిన యూనిట్ ఎంపిక చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. దళిత బంధు పథకం అమలుపై శనివారం హైదరాబాద్ బీఆర్కే భవన్ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ములుగు నుంచి కలెక్టర్ కృష్ణఆదిత్య పాల్గొన్నారు. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ పథకం అమలుకు మొదటి విడతగా కుటుంబాన్ని యూనిట్గా వంద మంది లబ్ధిదారుల చొప్పున ఎంపిక చేయాలని మంత్రి ఆదేశించారు. మార్చి లోపే వంద శాతం గ్రేడింగ్ పూర్తికావాలన్నారు. కలెక్టర్ కృష్ణ ఆదిత్య మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యేల సలహాలతో ప్రభుత్వ ఆదేశాల మేరకు నివేదికలు స్వీకరిస్తామని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్తోపాటు అదననపు కలెక్టర్ ఇలాత్రిపాఠీ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ తుల రవి, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.