తాడ్వాయి, జనవరి 22 : మరో 20 రోజుల్లో మహాజాతర ప్రారంభం. ఈసారి జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బంది కలుగకుండా ముందుగానే ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. అభివృద్ధి పనులు పూర్తి చేసి జాతర సాఫీగా జరిగేలా కృషి చేయాలని జిల్లా స్థాయి అధికారులు కాంట్రాక్టర్లను ఆదేశించారు. అయినా, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది అభివృద్ధి పనుల పరిస్థితి. గోవిందరావుపేట మండలంలోని పస్రా నుంచి ప్రాజెక్ట్నగర్ వర కు సుమారు 12.6 కిలోమీటర్ల దారిని అభివృద్ధి చేసేందుకు మహాజాతర నిధుల నుంచి ఆర్అండ్బీ శాఖకు రాష్ట్ర ప్రభు త్వం రూ.10 కోట్లు మంజూరు చేసింది. రెండు నెలల క్రితం పనులు ప్రారంభించారు. పలుమార్లు మేడారం పర్యటనకు వచ్చిన మంత్రులతో పాటు కలెక్టర్ త్వరగా పనులు పూర్తి చేయాలని ఆదేశించినా కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
మరోసారి నిధులు వృథా చేసేందుకేనా..!
2018లో జరిగిన అమ్మవార్ల మహాజాతరలో భాగంగా రూ. 22 కోట్లతో ఇదే రోడ్డును డబుల్ రోడ్డుగా అభివృద్ధి చేశారు. 2020లో జరిగిన జాతర సమయంలో రూ.50 లక్షలతో మరమ్మతుల పేరిట నిధులు వృథా చేశారు. ఈసారి రూ. 10 కోట్లు రోడ్డు నిర్మాణానికి కేటాయించారు. కానీ, నేటికీ పనులు పూర్తి చేయకపోవడంతో ఈ నెల 9వ తేదీన కారు బోల్తాపడి ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. బుధవారం రాత్రి మేడారం నుంచి హన్మకొండకు వెళ్తున్న ఎర్టీగా వాహనం ఎదురుగా వస్తున్న బైక్ను ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. రోడ్డు పనుల్లో భాగంగా అక్కడక్కడా కంకర కుప్పలు పోయడంతో పాటు ఒక దగ్గర ఎత్తుగా మరో దగ్గర లోతుగా ఉండడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. తొలగించిన పాత రోడ్డు బీటీని దూరంగా పోయాల్సి ఉండగా, సదరు కాంట్రాక్టర్ రోడ్డు సమీపంలోనే కుప్పలుగా పోశాడు. దీంతో జాతరకు వస్తున్న భక్తులు బీటీ కుప్పలను గుర్తించకపోవడంతో ప్రమాదానికి గురవుతున్నారు. రోడ్డుపై దుమ్ములేవకుండా నీళ్లు పోయా ల్సి ఉండగా కాంట్రాక్టర్ ఇవేమి పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. జాతరకు ముందు నాసిరకంగా పనులు చేపట్టి చేతులు దులుపుకోవాలని కాంట్రాక్టర్ చూస్తున్నాడని, వారికి అధికారులు సైతం సహకరిస్తున్నారనే ఆరోపణలు సమీప గ్రామాల ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. ఈ విషయమై కలెక్టర్ స్పందించి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఆర్అండ్బీ అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.