హైకోర్డు ఆదేశానుసారం
క్షేత్రస్థాయిలో సందర్శన
మడికొండ, జనవరి 22 : తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నందికొండ నర్సింగరావు శనివారం మడికొండ శివారులోని డంపింగ్యార్డును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. డంపింగ్యార్డుతో కలుగుతున్న నష్టాన్ని వివరిస్తూ 2018లో అప్పటి కార్పొరేటర్ తొట్ల రాజుయాదవ్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. యార్డును సందర్శించి నివేదికను అందజేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తికి ఈ మేరకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆయన మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్యతో కలిసి డంపింగ్యార్డును పరిశీలించారు. గుట్టలుగా పేరుకుపోయిన చెత్తను చూశారు. అక్కడ చేపడుతున్న పనులపై కమిషనర్ను అడిగి తెలుసుకున్నారు. పేరుకు పోయిన చెత్తను రీసైక్లింగ్ యూనిట్ ఏర్పాటు చేసి శుద్ధి చేస్తున్నట్లు వివరించారు. అలాగే, మాజీ కార్పొరేటర్ రాజయాదవ్తో పాటు పలువురు స్థానికుల నుంచి యార్డు వల్ల కలిగే ఇబ్బందులను తెలుసుకున్నారు. రాంపూర్ చెరువు నుంచి మడికొండ పెద్ద చెరువులోకి వచ్చి చేరుతున్న నీరు డంపింగ్యార్డు వల్ల కలుషితమవుతుందని జడ్జికి విన్నవించుకున్నారు. అలాగే, మడికొండ పెద్ద చెరువు నుంచి సోమడి చెరువు, వడ్డేపల్లి చెరువుకు ఇదే నీరు చేరుతోందని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీంతో చెరువుల నుంచి వచ్చే కాల్వలను నిశితంగా పరిశీలించారు. అదేవిధంగా పైన పేర్కొన్న చెరువు నీటి శాంపిల్స్ సేకరించి నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం హైకోర్టుకు పూర్తి నివేదికను అందజేస్తామని ఆయన చెప్పారు. కార్యక్రమంలో కాజీపేట తహసీల్దార్ కిరణ్కుమార్, ఆర్ఐ సురేందర్రెడ్డి, సీఎంహెచ్వో రాజారెడ్డి, ఈఈ లక్ష్మారెడ్డి, స్థానికులు దువ్వ కొమురయ్య, గడ్డం మహేందర్, మండల సంపత్రెడ్డి, ఆరె రమేశ్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.