భూపాలపల్లి రూరల్, అక్టోబర్ 20 :ప్రభుత్వ ఆదేశాల మేరకు జయశంకర్ జిల్లాలో వసతి గృహాలు ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ 1 నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ ఇంటర్, డిగ్రీ కళాశాలల్లో ప్రత్యక్ష బోధన ప్రారంభమైనా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పోస్ట్మెట్రిక్ వసతి గృహాలు తెరుచుకోలేదు. ప్రస్తుతం డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు జరుగుతుండగా, 25నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ఉన్న నేపథ్యంలో వసతి గృహాలు తెరువాలని అధికారులను సర్కారు ఆదేశించింది. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ మౌలిక వసతులు కల్పించి జిల్లాలోని ఆరు హాస్టళ్లను సోమవారం ప్రారంభించారు. దీంతో విద్యార్థుల హాజరు శాతం పెరుగనుందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పోస్ట్మెట్రిక్ వసతి గృహాలు ప్రారంభమయ్యాయి. కరోనా కేసులు అధికంగా పెరుగడంతో మూతపడ్డాయి. గత నెల సెప్టెంబర్ 1 నుంచి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఇంటర్, డిగ్రీ కళాశాలల్లో ప్రత్యక్ష బోధన ప్రారంభమైనప్పటికీ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పోస్ట్మెట్రిక్ వసతి గృహాలు ప్రారంభం కాలేదు. ప్రస్తుతం డిగ్రీ విద్యార్థులకు సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నాయి. అక్టోబర్ 25 నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు వార్షిక పరీక్షలు జరుగనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పోస్ట్మెట్రిక్ వసతి గృహాలు ప్రారంభించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో వసతి గృహాల సంక్షేమ అధికారులు గదులను సోడియం హైపోక్లోరైట్ ద్రావణంతో పిచికారీ చేయించారు. కొవిడ్ నిబంధనల మేరకు మౌలిక వసతులు కల్పించారు.
జిల్లాలో ఆరు హాస్టళ్లు
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఇంటర్, డిగ్రీ కళాశాలల్లో చదువుకుంటున్న దూర ప్రాంత విద్యార్థుల సౌకర్యార్థం ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆరు పోస్ట్ మెట్రిక్ వసతి గృహాలను సర్కారు ఏర్పాటు చేసింది. వీటిలో 2 ఎస్సీ (1బాలుర, 1బాలిక), 2 ఎస్టీ (1బాలుర, 1బాలిక), 2 బీసీ (1బాలుర, 1బాలికల) ఉన్నాయి. ఒక్కోక్క వసతి గృహంలో 100 మంది విద్యార్థులు ఉండి చదువుకోవచ్చు. ప్రస్తుతం ఈ వసతి గృహాల్లో దాదాపు 500 మంది విద్యార్థులు ఉంటూ చదువుకుంటున్నారు. గత సంవత్సరం కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండడంతో విద్యార్థులు వసతి గృహాల్లో ఉండేందుకు ఆసక్తి చూపలేదు. ప్రస్తుతం వైరస్ వ్యాప్తి తగ్గడం, విద్యాసంస్థలు ప్రారంభం కావడంతో ప్రభుత్వం వసతి గృహాలను తెరిచింది. దీంతో రానున్న రోజుల్లో విద్యార్థుల హాజరు శాతం పెరుగనున్నదని విద్యాశాఖ అధికారులు తెలుపుతున్నారు.
ప్రభుత్వ ఆదేశాలతో ప్రారంభించాం..
సుదీర్ఘ విరామం తరువాత కమిషనర్ ఆదేశాల మేరకు పోస్ట్ మెట్రిక్ విద్యార్థుల కోసం వసతి గృహాలను సోమవారం ప్రారంభించాం. పారిశుధ్య పనులతో పాటు గదు ల్లో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయించాం. కరోనా దృష్ట్యా భౌతిక దూరం పాటించేలా, గదుల్లో పరిమిత సంఖ్యలో విద్యార్థులు ఉండేలా చూడాలని వసతిగృహ సంక్షేమాధికారులకు సూచించాం. దూర ప్రాంత విద్యార్థులు వసతి గృహాలను సద్వినియోగం చేసుకోవాలి.