కలెక్టర్ కృష్ణ ఆదిత్య
ఘనంగా జయంతి ఉత్సవాలు
ములుగుటౌన్, అక్టోబర్20: మనిషిలో పరివర్తన వస్తే మహర్షి కాగలడనే పదానికి నిదర్శనం వాల్మీకి అని కలెక్టర్ కృష్ణ ఆదిత్య అన్నారు. వాల్మీకి జయంతి ఉత్సవాలను బుధవారం కలెక్టరేట్లో నిర్వహించారు. వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ బోయవాడైన వాల్మీకి మహర్షిగా మారి 24వేల శ్లోకాలతో రామాయాణ మహాకావ్యాన్ని పూర్తి చేసి సమాజానికి కుటుంబ బాధ్యతను, విలువలను తెలిపిన మహోన్నతుడని అన్నారు. ప్రతి ఒక్కరూ వాల్మీకిని స్ఫూర్తిగా తీసుకొని మంచి పేరు తెచ్చుకోవాలన్నారు.
జిల్లా సంక్షేమ భవన్లో..
జిల్లా బీసీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సంక్షేమ భవన్లో వాల్మీకి జయంతి నిర్వహించారు. ముఖ్య అతిథిగా డీఆర్వో రమాదేవి హాజరై వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమాల్లో కలెక్టరేట్ ఏవో శ్యామ్, సూపరింటెండెంట్ రాజ్ ప్రకాశ్, ప్రసాద్, బీసీ వెల్ఫేర్ అధికారి లక్ష్మణ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ తుల రవి, డీఎస్సీవో భాగ్యలక్ష్మి, డీవైఎస్వో పీవీఆర్ చారి, అధికారులు, సిబ్బంది, బోయ కులస్తులు, నర్సింహారావు, సర్వయ్య, సాంబశివరావు, సత్యం పాల్గొన్నారు.
గొప్ప కవి వాల్మీకి
భూపాలపల్లి రూరల్: హిందువుల సంస్కృతి, సంప్రదాయాలకు నిలయమైన రామాయణం అనే గ్రంథాన్ని రచించిన గొప్ప కవి మహర్షి వాల్మీకి అని జిల్లా సంయుక్త కలెక్టర్ కూరాకుల స్వర్ణలత అన్నారు. జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి టీ.శైలజ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో వాల్మీకి జయంతి నిర్వహించారు. ముఖ్య అతిథిగా జేసీ స్వర్ణలత హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ దివాకర, జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.
తహసీల్దార్ కార్యాలయంలో..
కన్నాయిగూడెం: వాల్మీకి జయంతి తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించారు. తహసీల్దార్ దేవాసింగ్, కార్యాలయ సిబ్బంది వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి ఆయన సాధించిన ఘనతను స్మరించుకున్నారు.