షాబాద్, జూలై 9 : మైనర్ పిల్లలను పనిలో పెట్టుకుంటే ఆయా యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రంగారెడ్డి కలెక్టర్ అమయ్కుమార్ హెచ్చరించారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఆపరేషన్ ముస్కాన్పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాలల హక్కులను హరించడం నేరమన్నారు. ఆపరేషన్ ముస్కాన్లో 9 టీంలు జిల్లాలో సైబరాబాద్, రాచకొండ పరిధిలో పనిచేస్తున్నాయని చెప్పారు. డీసీపీవోలు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించి ఇటుక బట్టీలు, భవన నిర్మాణాల్లో పనిచేసే పిల్లలను గుర్తించి వారిని కాపాడాలని డీసీపీవోలను కలెక్టర్ ఆదేశించారు. ప్రజల్లో అవగాహన కల్పించి బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్, జిల్లా శిశు సంక్షేమాధికారి మోతి, డిప్యూటీ లేబర్ అధికారి ప్రమోద్రెడ్డి, సైబరాబాద్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ కిశోర్కుమార్, చైల్డ్వెల్ఫేర్ చైర్మన్ నరేందర్రెడ్డి, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి స్వరాజ్యలక్ష్మి, జిల్లా విద్యాధికారి, ఎన్జీవోలు, చైల్డ్లైన్ సిబ్బంది, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
నాటిన మొక్కలను సంరక్షించుకోవాలి
నాటిన మొక్కలను కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, అధికారులు సంరక్షించుకోవాలని రంగారెడ్డి కలెక్టర్ అమయ్కుమార్ అన్నారు. శుక్రవారం శంకర్పల్లి మున్సిపల్ పరిధిలో నిర్వహిస్తున్న పట్టణ ప్రగతి పనులను అడిషనల్ కలెక్టర్ ప్రతీక్జైన్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కలను నిర్లక్ష్యం చేయకూడదన్నారు. విరివిగా ఖాళీ స్థలాల్లో మొక్కలను నాటాలన్నారు. మున్సిపల్లో నెలకొన్న సమస్యలను పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా పరిష్కరించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సాత విజయలక్ష్మి, వైస్ చైర్మన్ బి.వెంకట్రాంరెడ్డి, మున్సిపల్ కమిషనర్ యాదగిరి, మాజీ ఉప సర్పంచ్ సాత ప్రవీణ్కుమార్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.