విధులను నిర్లక్ష్యం చేస్తే చర్యలు
కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ
పెద్దపల్లి రూరల్, జూలై 6: పల్లెప్రగతిలో భాగంగా పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ సూచించారు. పెద్దపల్లి మండలం రంగాపూర్, రాఘవాపూర్, ముత్తారం, ధర్మాబాద్ గ్రామాలను మంగళవారం సంబంధిత అధికారులతో కలిసి ఆకస్మికంగా సందర్శించారు. రంగాపూర్లో సెగ్రిగేషన్ షెడ్డు, పల్లెప్రకృతి వనాన్ని పరిశీలించారు. రాఘవాపూర్లో రోడ్డువెంట ఏర్పాటు చేసిన అవెన్యూ ప్లాంటేషన్, పల్లెప్రకృతి వనాన్ని పరిశీలించి పలు సూచనలు, సలహాలు చేశారు. రాఘవాపూర్, రంగాపూర్ గ్రామాల్లో మియావాకీ విధానం ద్వారా పెరిగిన మొక్కలను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అధికారులు, సిబ్బంది విధులను నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పల్లెప్రకృతి వనాలకు బయో ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
హరితహారంలో పెద్ద మొక్కలను నాటాలని సూచించారు. నిర్ధేశించిన లక్ష్యాల మేరకు మొక్కలు నాటి ట్రీగార్డులను ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి ఇంటికీ ఆరు మొక్కలు పంపిణీ చేసి వాటిని నాటి సంరక్షించుకునేలా అవగాహన కల్పించాలన్నారు. ఎస్సీ కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. వైకుంఠధామాలకు గ్రీన్ ఫెన్సిం గ్ ఏర్పాటు చేయాలన్నారు. విద్యుత్ సమస్యలను పరిష్కరించే క్రమంలో ఇండ్లపై నుంచి వెళ్తున్న హైటెన్షన్ వైర్లను తొలగించే దిశగా చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుమార్ దీపక్, ఏపీడీ, ఎంపీడీవో ఎం.రాజు, మండల పంచాయతీ అధికారి సుదర్శన్, పంచాయతీ కార్యదర్శులు శ్రీనివాస్, సతీశ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.