హైదరాబాద్ : పారిశ్రామిక రంగానికి వెన్నుదన్నుగా నిలుస్తున్న సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు ( MSME ) బ్యాంకులు అండగా నిలవాలని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కోరారు. ఎంఎస్ఎంఈ రంగం అభివృద్ధి కోసం ఇండియన్ బ్యాంకు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రేరణ కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్ మంగళవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో ఎంఎస్ఎంఈ రంగం కోసం ప్రత్యేకంగా ప్రేరణ కార్యక్రమాన్ని ఇండియన్ బ్యాంక్ ప్రారంభించడం స్వాగతించదగ్గ విషయమన్నారు. రుణాలు, ఫండింగ్ విషయంలోనూ పారిశ్రామిక రంగానికి వెన్నుదన్నుగా నిలుస్తున్న సూక్ష్మ, మధ్యతరహా పారిశ్రామిక వేత్తలకు బ్యాంకులు అండగా ఉండాలని సూచించారు. ఈ దిశగా ఎంఎస్ఎంఈ రంగం కోసం ప్రేరణ కార్యక్రమాన్ని తీసుకువచ్చిన ఇండియన్ బ్యాంక్కి కేటీఆర్ అభినందనలు తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లో ఉన్న స్వయం సహాయక సంఘాలు గత రెండు దశాబ్దాలుగా తీసుకున్న రుణాలకు అద్భుతమైన రీపేమెంట్ శాతాన్ని కలిగి ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ ప్రస్తావించారు. ఇండియన్ బ్యాంకుతో ఇప్పటికే కాళేశ్వరం, మిషన్ భగీరథ వంటి కార్యక్రమాల్లో భాగస్వామ్యం ఉందని తెలిపారు. అద్భుతంగా అభివృద్ధి చెందుతున్న అర్బన్ డెవలప్మెంట్ రంగంలో ఉన్న అవకాశాలను పరిశీలించాలని కేటిఆర్.. బ్యాంక్ సీఈఓ అండ్ ఎండీ పద్మజా చుండురిని కోరారు. తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన టీ-హబ్ మరియు వి-హబ్ లో భాగస్వాములు కావాలని మంత్రి కోరారు. తెలంగాణ రాష్ట్రంలో ఇండియన్ బ్యాంక్ మరింతగా విస్తరించి అద్భుతమైన ప్రగతి సాధిస్తుందన్న ఆకాంక్షను మంత్రి కేటీఆర్ వ్యక్తం చేశారు.
ప్రస్తుతం ఉన్న సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో రుణాల వసూలుకు సంబంధించి బ్యాంకులు కొంత ఉదారంగా వ్యవహరించి, అవి తిరిగి గాడిన పడే విధంగా ప్రయత్నం చేయాలని కేటీఆర్ అన్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి, ఆర్బీఐ గవర్నర్కు విజ్ఞప్తి చేసిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. ఎంఎస్ఎంఈ రంగానికి అండగా ఉండేందుకు కేంద్రం ప్రకటించిన ప్రోత్సాహకాలతో పాటు రుణాల లింకేజీ విషయంలో కొంత సంక్లిష్టత ఉందని, దీన్ని మరింత సులువు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎంఎస్ఎంఈ కంపెనీలను ఆదుకునేందుకు తమ ప్రభుత్వం, దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ పేరిట ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టిందని, ఈ కార్యక్రమంలో ఇండియన్ బ్యాంక్ భాగస్వామి అయి ఎంఎస్ఎంఈలకు సహాయం చేయాలని కేటీఆర్ కోరారు.
అనంతరం ఇండియన్ బ్యాంక్ సీఈవో, ఎండీ పద్మజా చుండూరు మాట్లాడారు. ఎంఎస్ఎంఈ రంగానికి అండగా ఉండేందుకు తాము ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రారంభిస్తున్నామని తెలిపారు. తెలంగాణలో మంత్రి కేటీఆర్ తమ కార్యక్రమాన్ని ప్రారంభించడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. మంత్రి కేటీఆర్ రాష్ట్రంలో ఉన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని ఆమె పేర్కొన్నారు. తమ బ్యాంకు ప్రారంభించిన ఈ ప్రేరణ కార్యక్రమం ద్వారా ఎంఎస్ఎంఈలకు అత్యంత సులువుగా రుణాలు ఇవ్వడంతో పాటు వారి పరిశ్రమల నిర్వహణకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు కూడా అందిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో తమ బ్యాంకు ఇప్పటికే పలు కార్యక్రమాల్లో భాగస్వామిగా ఉందని, భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలలో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆమె తెలిపారు. తెలంగాణ రాష్ట్రం గత ఏడు సంవత్సరాల్లో అద్భుతమైన ప్రగతి సాధించిందని అన్నారు. హైదరాబాదీ అయిన తనకు ఈ కార్యక్రమం ప్రారంభించడం అత్యంత సంతోషదాయకం అని పద్మజా చుండూరు అన్నారు.
ప్రగతి భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్తో పాటు పలువురు సీనియర్ బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.