కోర్టు డ్యూటీ ఆఫీసర్లు బాధ్యతగా విధులు నిర్వర్తించాలి

కృష్ణకాలనీ, ఫిబ్రవరి 10: కోర్టు డ్యూటీ ఆఫీసర్లు బాధ్యతగా విధులు నిర్వర్తించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా అదనపు ఎస్పీ శ్రీనివాసులు అన్నారు. బుధవారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో జిల్లాలోని పోలీసు అధికారులు, కోర్టు డ్యూటీ ఆఫీసర్లతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ప్రతి కేసులోని పూర్తి వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. కేసుల పురోగతిని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు తెలియజేయాలని, నేరస్తులకు శిక్షపడేలా చేసి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. సమన్లు, ఎన్బీడబ్ల్యూలను సంబంధిత వ్యక్తులకు జారీ చేయడంలో జాప్యం, నిర్లక్ష్యం వహించరాదని అన్నారు. సమావేశంలో భూపాలపల్లి, కాటారం సీసీఎస్, డీసీఆర్బీ, ఎస్బీ ఇన్స్పెక్టర్లు వాసుదేవరావు, హథీరామ్, మోహన్, శ్రీనివాస్, సైదారావు, ఎస్సైలు పాల్గొన్నారు.