బంట్వారం, జూన్ 28 : ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనే బంట్వారం ఒకప్పుడు వెనకబడిన మండలం. అందులో వేసవి వచ్చిందంటే ఎటు చూసినా ఎండు గడ్డితో నిండిన గుట్టలు, అక్కడక్కడ విసిరి పారేసినట్లు కనిపించే చెట్లు. అప్పటికే పంటలన్నీ ఇంటికి చేరాక ఎడారిని తలపించే పంట పొలాలు. కనుచూపు మేరలో పచ్చదనమే కనిపించని ప్రదేశం బంట్వారం మండలం. ప్రస్తుతం ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలతో పల్లెల రూపురేఖలు మారాయి. ఊరికో పల్లె ప్రకృతి వనంతో ప్రతి గ్రామంలో పచ్చని చెట్లతో ఆహ్లాదకరంగా దర్శనమిస్తున్నాయి. రెండేండ్లుగా ప్రభుత్వం చేపట్టిన ‘పల్లె ప్రకృతి వనం’ లతో పచ్చనిహారంగా మారి గ్రామస్తులు, చూపరులను కనువిందుకు చేస్తున్నాయి. ఒక్కో పల్లె ప్రకృతి వనం(పార్కు)లో అనేక రకాలు మొక్కలు ఒకే చోట కనిపిస్తున్నాయి.
మండలంలో 13 ప్రకృతి వనాలు
ప్రతి గ్రామ పంచాయతీకి ఒక పల్లె ప్రకృతి వనం ఉండాలన్నది ప్రభుత్వ సంకల్పం. అందులో భాగంగా మండలంలో 13 పార్కుల నిర్మాణాన్ని చేపట్టింది. గ్రామాల వారీగా ఒక్కో పార్కులో 1600 నుంచి 4000 వరకు మొక్కలను పెంచుతున్నారు. బంట్వారంలోని అర ఎకరా స్థలంలో 2000 మొక్కలు, బస్వపూర్లో అర ఎకరాలో 2000 మొక్కలు, బొపునారంలో ఒక ఎకరంలో 2800 మొక్కలు, మాధవపూర్లో అర ఎకరంలో 300 మొక్కలు, మాలసోమారం ఎకరంలో 500 మొక్కలు, నాగవరంలో ఎకరంలో 400 మొక్కలు, రొంపల్లిలో 0.30 ఎకరంలో 3000 మొక్కలు, సల్బత్తపూర్ అర ఎకరంలో 2000 మొక్కలు, సుల్తాన్పూర్లో ఎకరంలో 1800 మొక్కలు, తొరుమామిడిలో ఎకరంలో 4400 మొక్కలు, యాచారంలో ఎకరంలో 1600మొక్కలు, మంగ్రాస్పల్లిలో అర ఎకరంలో 600 మొక్కలు, నూరుళ్లపూర్లో అర ఎకరంలో 400 మొక్కలను నాటి పెంచుతున్నారు.
పార్కుల నిర్మాణానికి రూ 10.65 లక్షల నిధులు
మండలంలోని గ్రామ పంచాయితీల్లో నిర్మించిన పల్లె ప్రకృతి వనాలకు సుమారు రూ. 10.65 లక్షల నిధులను వెచ్చించారు. ఈ నిధులతో గుంతలు తీసి, మొక్కలు నాటడం లాంటి పనులతో పాటు వాటి సంరక్షణకు నీటి సౌకర్యం, బోరు మోటారు, డ్రిప్ సిస్టమ్, ఫెన్సింగ్ లాంటి పనులను చేపట్టారు. ఇలా గ్రామాల వారికి బంట్వారం పార్కుకు రూ 0.90 లక్షలు, బస్వపూర్ రూ 0.79 లక్షలు, బొపునారం రూ 0.77 లక్షలు, మద్వపూర్ రూ 0.69 లక్షలు, మాలసోమారం రూ 1.00 లక్షలు, నాగవారం రూ 0.53 లక్షలు, రొంపల్లి రూ 2.08 లక్షలు, సల్బత్తాపూర్ రూ 0.74 లక్షలు, సుల్తాన్పూర్ రూ 0.65లక్షలు, తొరుమామిడి రూ 1.83 లక్షలు, యాచారం రూ 0.67 లక్షలను వెచ్చించారు.
గ్రామాల్లో పచ్చదనం కనిపిస్తోంది
గ్రామాల్లో పార్కుల పెంచడం వల్ల మంచి వాతావరణం కనిపిస్తున్నది. పచ్చదనంతో పాటు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. గతంలో పచ్చదనం అనేది కనిపించేది కాదు. ఇప్పుడుప్రభుత్వం చేపడుతున్న పచ్చదనం కార్యక్రమంతో గ్రామాల్లో పచ్చదనం సంతరించుకున్నది.