కొచ్చి: సామాజిక కార్యకర్త, నటి అయేషా సుల్తానాను లక్షద్వీప్ పోలీసులు విచారించారు. ఆదివారం సాయంత్రం ఆమె లక్షద్వీప్ రాజధాని కవరట్టిలో ఉన్న పోలీస్ స్టేషన్కు వెళ్లారు. దేశద్రోహం కేసులో విచారణ సాగింది. ఓ టీవీ చర్చలో పాల్గొన్న అయేషా.. లక్షద్వీప్ పాలనాధికారిని జీవాయుధంతో పోల్చారు. ఈ నేపథ్యంలో ఓ బీజేపీ నేత చేసిన ఫిర్యాదు ఆధారంగా ఆమెపై కేసు బుక్ చేశారు. అయితే ఆ కేసులో ఆమె ముందుస్తు బెయిల్ తెచ్చుకున్నారు. కావరట్టి పోలీసులు సుమారు మూడున్నర గంటల పాటు అయేషాను విచారించినట్లు తెలుస్తోంది. ఓ వీడియో పోస్టు చేసిన ఆమె.. విచారణ సవ్యంగా సాగినట్లు చెప్పింది. మరో నాలుగు రోజుల పాటు లక్షద్వీప్లోనే ఉండాలని పోలీసులు ఆదేశించినట్లు వెల్లడించారు. లక్షద్వీప్లోని చీలత్ దీవి ఆమె స్వంత ఊరు. కొచ్చిలో ఉంటున్న సుల్తానా.. మోడలింగ్ చేస్తోంది. మళయాళం సినిమాల్లోనూ నటిస్తోంది. లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ ప్రఫూల్ పటేల్ను తొలగించాలని కేరళ అసెంబ్లీ ఏకగ్రీ తీర్మానం చేసిన విషయం తెలిసిందే.