రంగారెడ్డి, జూన్ 18, (నమస్తే తెలంగాణ): పెండింగ్లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. నూతన చట్టంతో రెవెన్యూ శాఖలో సంస్కరణలు తీసుకొచ్చిన ప్రభుత్వం ఒక్కొక్కటిగా భూ సమస్యలను పరిష్కరిస్తున్నది. ఇప్పటికే పార్ట్-ఏ భూ సమస్యలను పరిష్కరించి, పట్టా పాసుపుస్తకాలు జారీ చేసింది. ప్రస్తుతం పార్ట్-బీ సమస్యలను కూడా పరిష్కరించేందుకు చర్యలు చేపట్టింది. పార్ట్-బీలో మొదట ఆర్వోఆర్ (రికార్డ్ ఆఫ్ రైట్) కేసులకు పరిష్కారం చూపేందుకు ప్రతి జిల్లాలో ప్రత్యేక ట్రిబ్యునల్ను ఏర్పాటు చేసింది. కొత్త రెవెన్యూ చట్టానికి ముందు వరకు కొనసాగిన జాయింట్ కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్ కోర్టులకు స్వస్తి పలికి, వాటి స్థానంలో రెవెన్యూ కోర్టుల్లో కేసులు పరిష్కరించేందుకు కలెక్టర్ నేతృత్వంలో ట్రిబ్యునల్ను ఏర్పాటు చేశారు. ఈ ట్రిబ్యునల్లో చైర్మన్గా కలెక్టర్, సభ్యులుగా అదనపు కలెక్టర్(రెవెన్యూ) వ్యవహరిస్తున్నా రు. ఈ ప్రత్యేక ట్రిబ్యునల్ ఆర్వోఆర్ కేసులను కొలిక్కి తీసుకొస్తున్నది. ఇప్పటికే ఈ కేసులకు సంబంధించి భూమి పత్రాల ఆధారంగా ఆర్డర్లు జారీచేసింది. కోర్టు ఆదేశాలతో మరోసారి పిటీషనర్లకు నోటీసులు జారీ చేసిన ప్రత్యేక ట్రిబ్యునల్ వారం రోజులుగా ఇరుపక్షాల వాదనలు వింటూ ఒక్కొక్క ఆర్డర్ను సిద్ధం చేస్తున్నారు.
సోమవారం నుంచి ఆర్డర్స్..
రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 425 ఆర్వోఆర్ కేసులున్నాయి. కలెక్టర్ అమయ్కుమార్ ఆధ్వర్యంలోని ప్రత్యేక ట్రిబ్యునల్ ఈ కేసుల పరిష్కార ప్రక్రియను వేగవంతం చేశారు. సంబంధిత పిటీషనర్లందరికీ నోటీసులు జారీ చేసి, రోజువారీగా ఇరుపక్షాల వాదనలు వింటున్నారు. ఆయా భూములకు సంబంధించి పిటీషనర్లు సమర్పించే భూ పత్రాలను కూడా ట్రిబ్యునల్ అధికారులు పరిశీలిస్తున్నారు. వాదనలు పూర్తయిన కేసులకు సంబంధించి మరోసారి పరిశీలిస్తున్న ప్రత్యేక ట్రిబ్యునల్, వాటి ఆర్డర్స్ను సిద్ధం చేస్తున్నారు. పూర్తి పారదర్శకంగా భూ రికార్డులు, పత్రాల ఆధారంగా ఆర్డర్లను సిద్ధం చేస్తున్నారు. సోమవారం నుంచి వాదనలు పూర్తైన ఆర్వోఆర్ కేసులకు ఆర్డర్స్ను పిటీషనర్లకు జారీ చేయనున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు కసరత్తు ప్రారంభించారు. మరోవైపు జిల్లాలో 425 ఆర్వోఆర్ కేసులుండగా ఇప్పటివరకు 300 కేసులకు సంబంధించి వాదనలు పూర్తయ్యాయి. మిగతా కేసుల వాదనలు పూర్తి చేసి ఈ నెలాఖరులోగా ఆర్వోఆర్ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారు. ఈ కేసుల్లో అధికంగా తమకు తెలియకుండానే రిజిస్ట్రేషన్ చేశారని కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు పిటిషన్ వేయడం, రిజిస్ట్రేషన్ పూర్తైనప్పటికీ డబ్బు లు ఇవ్వలేదని, ఆస్తిలో తమకు వాటా ఇవ్వలేదంటూ కూతుళ్లు ఫిర్యాదు చేయడం వంటి కేసులు ప్రధానంగా ఉన్నట్లు అధికారులు తేల్చారు.
కొన్నేండ్లుగా పెండింగ్లోనే..
గతంలో మండల స్థాయిలో తహసీల్దార్ కోర్టు, డివిజన్ స్థాయిలో ఆర్డీవో కోర్టు, జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో కోర్టులుండేవి. పట్టా పాసుపుస్తకాల జారీతోపాటు తప్పుల సవరణ ఇతర భూ సమస్యల పరిష్కారానికి తహసీల్దార్ కోర్టును బాధితులు ఆశ్రయించేవారు. ఈ కోర్టులో సదరు వ్యక్తికి న్యాయం జరగలేదని భావిస్తే ఆర్డీవో కోర్టులో అప్పీల్ చేసుకునేవారు. తదనంతరం జేసీ కోర్టులో అప్పీల్ చేసుకునే వీలుండేది. జాయింట్ కలెక్టర్ కోర్టులోనూ తీర్పు వ్యతిరేకంగా వచ్చినట్లయితే ఆపై హైకోర్టుకు, సుప్రీంకోర్టును ఆశ్రయించేవారు. ఈ విధంగా ఇన్ని దశల్లో కోర్టులు ఉండడం సమస్యలు పరిష్కారం కాకపోవడంతో కొన్నేండ్లుగా భూ సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. ఒక్కో సమస్య పరిష్కారానికి ఏండ్లుగా కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేది. ఈ పరిస్థితిని గుర్తించిన సీఎం కేసీఆర్ కొత్త రెవెన్యూ చట్టంలో భాగంగా వివిధ స్థాయిలో కోర్టులను రద్దు చేసి ప్రత్యేక ట్రిబ్యునల్ను అమల్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీంతో పకడ్బందీగా భూ సమస్యలు పరిష్కారమవుతున్నాయి.