వ్యాధి వస్తే వైద్యులు రక్షిస్తారు.., రోగం రాకుండా చూసి మనల్ని రక్షిస్తున్న వాళ్లు సఫాయి కార్మికులు. ప్రపంచమంతటా కరోనా వైరస్ కలిగిస్తున్న బీభత్సం మనకు తెలిసిందే. ముందు జాగ్రత్త పడి తెలంగాణలో దీని కట్టడి కోసం పటిష్ట చర్యలు తీసుకోవడం వల్ల ప్రాణ నష్టం, వ్యాధివ్యాప్తి చాలా తక్కువ ఉన్నది. పట్టణ ప్రాంతాల్లో ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలోకరోనా ప్రభావం ఇంకా తగ్గలేదు. వైరస్ను కట్టడి చేయడంలో ప్రముఖ పాత్ర వహించినది డాక్టర్లు, నర్సులు, పోలీసులు నిర్వహించిన పాత్ర ఒక ఎత్తయితే, పారిశుధ్య (సఫాయి) కార్మికులు నిర్వహించిన పాత్ర మరింత ముఖ్యమైనది. వీరందరినీ సక్రమంగా సరైన సమయంలో సమయస్ఫూర్తితో ఉపయోగించుకున్నది తెలంగాణ ప్రభుత్వం. ఇండ్లను, పరిసరాలను, రోడ్లను, గల్లీలను ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ, శానిటైజ్ చేస్తూ గ్రామాలను, పట్టణాలను వైరస్ బారి నుంచిరక్షించటంలో పారిశుధ్య కార్మికులు కీలక పాత్ర పోషించారు.
కరోనా కాలంలో కూడా ప్రతి సఫాయికి రూ.5 వేలను బోనస్గా ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. నగరాలతో పాటు గ్రామాల్లో పనిచేసే పారిశుధ్య కార్మికులకు రూ.31 వేల బీమా సౌకర్యాన్ని కల్పించారు. దీనికి సంబంధించి బీమా ప్రీమి యం సొమ్మును ప్రభుత్వమే చెల్లించడం మరో మానవీయ అంశం.
పరిశుభ్రంగా ఉంచడానికి మల, మూత్రాలను సైతం ఎత్తడానికి వెనుకడుగు వేయరు సపా యి కార్మికులు. మురికి, చెత్త, అపరిశుభ్రత ద్వారా వ్యాపించే వ్యాధులను నివారించటంతో పాటు, కరోనా వైరస్ను అదుపులో ఉంచాలంటే పారిశుధ్య కార్మికులు నిరంతరం పనిచేయవలసి ఉంటుంది. తమ ప్రాణాలను పణంగా పెట్టి సఫాయి కార్మికులు చేసిన సేవలు ఈ సమాజం ఏమిచ్చినా తీర్చుకోనివి. మురికి వాసనను, క్రిముల దాడులను తట్టుకొని ఆ బాధను అనుభవిస్తూ ప్రజలను కాపాడే దేవదూత లు పారిశుధ్య కార్మికులు.
ముఖానికి మాస్క్ వేసుకున్నంత తేలిక కాదు రోగ క్రిములను జయించడం. చెత్తా చెదారం, పారేసిన తినుబండారాలు, ప్లాస్టిక్, రకరకాల రసాయనా లు, చివరికి అశుద్ధాన్ని నింపుకొని పారుతున్న మోరీలను శుభ్రపరిచే పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుల సేవలు శ్లాఘనీయం. ఎవరి మలినాన్ని వారు శుభ్రం చేసుకోవడానికి ఇబ్బంది పడే మనుషులు తమందరి మలినాలన్నీ ఎత్తి పోసేవారిని మాత్రం దూరంగానే ఉంచుతారు. రకరకాలుగా సామాజికంగా అవమానాలకు గురిచేస్తారు. వారిని కనీసం ముట్టుకోవడానికి సైతం ఇష్టపడని మనం, నిజంగా వారి సేవలను గుర్తిస్తున్నామా? తెల్లారకముందే లేసి చీడ పీడను వదిలించి తిరిగి కడిగిన ముత్యంలా మనకు పరిసరాలను అందిస్తున్న సఫాయి కార్మికులకు తగిన ప్రతిఫలం దక్కుతున్నదా అనే కోణంలో అందరూ ఆలోచించాలి. సమాజ మలినాన్నంతా పారదోలి, ఇక సుఖించడం మీ వంతు అని మనల్ని దీవిస్తున్న వాళ్లు సఫాయి కార్మికులు.
సామాజిక పరిశుభ్రత అనేది ఎవరి ఇండ్లను వారు పరిశుభ్రంగా ఉంచడంపైన ఆధారపడి ఉం టుంది. కొంతవరకు ఆయా ఇంటి వారి బాధ్యతగా ఉన్నప్పటికీ, వ్యవస్థాగతంగా, సామాజికంగా చేయాల్సిన కృషి ఎంతో ముఖ్యమైనది. పారిశుధ్య కార్మికులే పనిచేయకుంటే ప్రదేశాలన్నీ ఈగలు, దోమలు, వివిధ క్రిములతో పరిసరాలన్నీ మురికి కూపంగా మారుతాయి. అవే వ్యాధులకు క్రిములకు కేంద్రాలుగా మారి రోగాలు వ్యాపిస్తాయి. ముఖ్యంగా మరు గు దొడ్లను శుభ్రం చేసే కష్టతరమైన పనిని ఈ పారిశుధ్య కార్మికులే చేస్తున్నారు.
మన దేశంలో ఈ పారిశుధ్య పనిని ఫలానా వాళ్లు మాత్రమే చేయాలనేది ఉన్నది. ఒకటి రెండు కులాలకు చెందినవారే ఈ పనిని చేస్తున్నారు. అంతటి ప్రాధాన్యమైన పని చేస్తూ కూడా దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు. నిజానికి మల మూత్రాలను తొలగించే పనులను సాటి మనుషులు చేయ టమనేది నాగరిక సమాజానికి మచ్చ లాంటిదే. అమానవీయమే. ఇలాంటి పనుల్లో మనుషులకు బదులు యంత్రాలను వినియోగించటం అభివృద్ధి చేయాల్సిన అవస రం ఉన్నది. ఇప్పటికీ మలమూత్రాలుండే గుంటలు, డ్రైనేజీ మ్యాన్ హోల్లోకి దిగిన సఫాయి కార్మికులు ఎంతోమంది మృత్యువాత పడిన ఉదంతాలు ఉన్నాయి. ఒక అధ్యయనం ప్రకారం దేశంలో ఏటా వందల మంది సఫాయి కార్మికులు మ్యాన్హోల్లో దిగి విషవాయువుల ప్రభావంతో చనిపోతున్నారు. పారిశుధ్య పనులకు యంత్రాలను వినియోగించటం తప్పనిసరి చేయాలని ప్రభుత్వాలు చెప్తున్నా, చట్టాలు చేసినా ఆచరణలో అమలుకు నోచుకోకపోవటం విషాదం.
శాస్త్ర సాంకేతిక రంగాల్లో, నాగరికతలో ఎంతో ముందుకుపోయామని చెప్పుకొంటున్న ఈ ఆధునిక ప్రపంచంలో మనుషుల చేత మలమూత్రాలు ఎత్తిపోసే పనులను చేయించటం అనాగరికం అనక తప్పదు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత కొన్నేండ్లుగా పారిశుధ్య పనులకు, మ్యాన్హోల్ పనులకు ఆధునిక యంత్రాలను సమకూర్చటం హర్షణీయం.
పారిశుధ్య కార్మికుల సేవలను, కరోనా సమయం లో వారి సేవా నిరతిని, త్యాగపూరిత పనిని గుర్తించిన నాయకుడు కేసీఆర్ ఆ దీనులకు అండదండగా నిలిచారు. వారి సేవలను హృదయానికి హత్తుకున్నాడు. కరోనా సమయంలో అందరూ సామాజిక దూరం పాటించాలనుకుంటూ పాటిస్తున్నాం. కానీ సామాజికదూరం అనే మాట సరైంది కాదని, ఆ పదాన్ని వాడకూడదని, భౌతికదూరం అనాలని చెప్పిన మానవీయ మనీషి కేసీఆర్. సఫాయి కార్మి కులను అనేక సంక్షేమ పథకాల ద్వారా అండగా నిలిచారు కేసీఆర్. కరోనా విపత్తు సమయంలో విధు లు నిర్వహిస్తున్న పారిశుధ్య కార్మికులకు జీతభత్యాలను పెంచి గౌరవించారు. వారికి సలాం చేసి జీతభత్యాలను పెంచడం, మన అంద రి తరపున సఫాయిలకు ధన్యవాదాలు తెలపడమే. సఫాయి కార్మి కుల సేవలను కొనియాడుతూ అం డదండగా నిలబడిన కేసీఆర్ ఆదర్శవంతుడు.
(వ్యాసకర్త: గొల్లకుర్మ హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు)
–గోసుల శ్రీనివాస్ యాదవ్