కామారెడ్డి టౌన్/బిచ్కుంద, జూన్ 17: అక్రమాలకు పాల్పడుతున్న పోలీసు కానిస్టేబుళ్లపై వేటుపడింది. కామారెడ్డి జిల్లాలోని బీర్కూర్ ఇసుక క్వారీ నుంచి వచ్చే లారీడ్రైవర్ల నుంచి అక్రమంగా వసూళ్లకు పాల్పడుతున్న నలుగురు కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటువేశారు. బీర్కూర్ పోలీసుస్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుళ్లు బి. సంతోష్, బి. పరంధాములు, సీహెచ్. భవిత, మైశకళను సస్పెండ్ చేశారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ శ్వేతారెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. నలుగురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ ఎస్పీ జారీ చేసిన ఉత్తర్వులు అందాయని బిచ్కుంద ఎస్సై సాయన్న తెలిపారు.
వసూళ్ల పర్వం
బిచ్కుంద ఎస్సై సాయన్న ప్రతిరోజు కానిస్టేబుళ్లకు దడ్గి-శాంతపూర్ దారిలో లారీలను మళ్లించడానికి విధి నిర్వహణలో భాగంగా డ్యూటీలు వేసేవారు. లారీలను తనిఖీ చేయాల్సిన సదరు కానిస్టేబుళ్లు లారీ డ్రైవర్ల వద్ద డబ్బులు తీసుకొని పుల్కల్-బాన్సువాడ రూట్లో లారీలను మళ్లించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఖత్గావ్ మంజీరా నది నుంచి ఇసుక నింపుకొని వస్తున్న లారీ డ్రైవర్ వద్ద హోంగార్డు డబ్బులు వసూలు చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో జిల్లా పోలీస్ అధికారి నెల రోజుల క్రితమే విచారణకు ఆదేశించారు. బిచ్కుంద పీఎస్ కానిస్టేబుళ్లు భవిత, మైశకళ దడ్గి గేటు వద్ద, పరంధాములు, సంతోష్ అయ్యప్ప మందిరం వద్ద లారీలను దారి మళ్లించడానికి విధులు నిర్వర్తించేవారు. బిచ్కుంద మండలం ఖత్గావ్ మంజీరా నది నుంచి ఇసుక నింపుకొని వస్తున్న లారీడ్రైవర్ల నుంచి డబ్బుల వసూళ్లకు పాల్పడ్డారు. వీరి అక్రమ వసూళ్లపై ఫిర్యాదులు అందడంతో జిల్లా అధికారులు విచారణకు ఆదేశించారు. విచారణలో ఈ నలుగురు కానిస్టేబుళ్లు లారీడ్రైవర్ల నుంచి డబ్బులకు పాల్పడుతున్నట్లు నిర్ధారణ కావడంతో ఎస్పీ సస్పెన్షన్ వేటు వేశారు. ఈ విషయం జిల్లాలో చర్చనీయాంశంగా మారగా.. అక్రమ వసూళ్లకు పాల్పడేవారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.