మంత్రి వేముల, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, ఎంపీ సంతోష్తో కలిసి ఏడుగంటలపాటు పర్యటన
డబుల్ బెడ్రూం ఇండ్లు, పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు
విస్తృతంగా మంత్రి కేటీఆర్ పర్యటన
సిరిసిల్ల/వేములవాడ/ఎల్లారెడ్డిపేట/సిరిసిల్ల రూరల్/బోయినపల్లి, జూన్ 16 : ఆప్యాయంగా పలుకరిస్తూ.. అభివృద్ధి పనులను ప్రారంభిస్తూ మంత్రి కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో బుధవారం విస్తృతంగా పర్యటించారు. మొదట ఎల్లారెడ్డిపేట మండలంలో 264 డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించి, లబ్ధిదారులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. అనంతరం సిరిసిల్లలో ఆర్అండ్బీ గెస్ట్హౌస్కు శంకుస్థాపన చేసి, డయాగ్నోస్టిక్ సెంటర్ను ప్రారంభించారు. తర్వాత వేములవాడ దవాఖానలో కాన్సన్ట్రేటర్లను అందజేశారు. అక్కడి నుంచి బోయినపల్లి మండలానికి వెళ్లి కొదురుపాకలో రైతు వేదిక, కేడీసీసీ బ్యాంకు భవనం, రోడ్డు విస్తరణ పనులు, విలాసాగర్ ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభించారు.
ఒక్కొక్కరిని పలుకరిస్తూ.. అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తూ మంత్రి కేటీఆర్ పర్యటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో సుమారు ఏడు గంటల పాటు సాగింది. మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్కుమార్తో కలిసి ఉదయం 11.30 నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు జిల్లాలో పర్యటించారు. మొదట ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లిలో 2.42 కోట్లతో 48, బొప్పాపూర్లో 2.42 కోట్లతో 48, ఎల్లారెడ్డిపేటలో 10.57 కోట్లతో 168 డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించారు. ఎల్లారెడ్డిపేటలో గృహ ప్రవేశం చేసిన లబ్ధిదారులకు సర్పంచ్ నేవూరి వెంకట్రెడ్డి కానుకగా ఇచ్చిన దుస్తులను పంపిణీ చేశారు. అనంతరం అక్కడే లబ్ధిదారులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఆయాచోట్ల గృహప్రవేశాల అనంతరం లబ్ధిదారులతో ఆప్యాయంగా ముచ్చటించారు. ఇండ్ల లోపలికి వెళ్లి మరీ పలుకరించారు.
ఫొటోలు, సెల్ఫీలు దిగారు. మధ్యాహ్నం సిరిసిల్లకు చేరుకుని 2.20 కోట్లతో నిర్మిస్తున్న ఆర్అండ్బీ అతిథి గృహానికి శంకుస్థాపన చేశారు. సిరిసిల్లలోని రెవెన్యూ కార్యాలయ సముదాయంలో 1.50 కోట్ల సీఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ను ప్రారంభించారు. అనంతరం వేములవాడలో సూపర్ గ్యాస్ వైస్ చైర్మన్ శ్రీమన్నారాయణ, ఉపేందర్గౌడ్ విరాళంగా ఇచ్చిన 10 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను ప్రభుత్వ దవాఖాన సిబ్బందికి అందజేశారు. అక్కడి నుంచి బోయినపల్లి మండలం విలాసాగర్కు వెళ్లి అక్కడి చెరువు నింపేందుకు 1.10కోట్లతో నిర్మించిన పంప్ హౌస్ను ప్రారంభించారు. అక్కడ జలాలకు పూజలు చేశారు. అక్కడి నుంచి కొదురుపాకకు చేరుకుని ఆర్అండ్ఆర్ కాలనీ నుంచి ఒద్యారం దాకా 21 కోట్లతో ఫోర్ లైన్, జంక్షన్ అభివృద్ధి పనులను, అక్కడే 80 లక్షలతో నిర్మించిన కేడీసీసీ బ్యాంకు కొత్త భవనాన్ని ప్రారంభించారు. అనంతరం బోయినపల్లి మండలం కొదురుపాకలో తన అమ్మమ్మ-తాతయ్య లక్ష్మమ్మ-కేశవరావు పేరున నిర్మించిన రైతు వేదికను ప్రారంభించి, సభలో పాల్గొన్నారు. తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తన పర్యటనలో అక్కడక్కడా కనిపించిన వారిని ఆప్యాయంగా పలుకరించారు.