ఏడేండ్లలో నగర రూపురేఖలు మార్చాం
ఆర్థిక ఇబ్బందులున్నా సంక్షేమాన్ని కొనసాగిస్తున్నం
మంత్రి గంగుల కమలాకర్
21, 40వ డివిజన్లలో పలు అభివృద్ధి పనులు ప్రారంభం
కార్పొరేషన్, జూన్ 16: కరోనా ఆపత్కాలంలోనూ అభివృద్ధిని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్న ఘనత కేసీఆర్ సర్కారుకే దక్కిందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఉద్ఘాటించారు. ఆర్థిక ఇబ్బందులున్నా సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నామని చెప్పారు. బుధవారం కరీంనగర్లోని 21వ డివిజన్లో రూ. 24 లక్షలు, 40వ డివిజన్లో రూ. 32 లక్షలతో పలు అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలు టీఆర్ఎస్పై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబె ట్టుకునేలా పనులు చేస్తున్నామన్నారు. ఏడేండ్లలో నగర రూపురేఖలు మార్చామన్నారు. రాబోయే రోజుల్లో సుందరంగా తీర్చిదిద్దుతామని పేర్కొ న్నారు. తాము చేస్తున్న అభివృద్ధ్దిని జీర్ణించుకోలేక విపక్షాలు విమర్శలు చేస్తున్నాయన్నారు. అలాంటి వారికి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులే సమాధానమన్నారు. నగరాలు అభివృద్ధ్ది చెందితేనే పెద్ద కంపెనీలు వస్తాయని, అప్పుడే స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయన్న ఆలోచనతో ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని చెప్పారు. నగరాభివృద్ధ్ది కోసం సీఎం కేసీఆర్ వందల కోట్ల నిధులను మంజూరు చేశారన్నారు.
60 ఏళ్లుగా సాగని అభివృద్ధిని ఈ ఏడేళ్ల కాలంలో చేశామన్నారు. నగరం పక్కనే మానేరు డ్యాం ఉన్నా ఇన్నాళ్లు మంచినీటి కోసం ఇబ్బందులు పడ్డామని, కానీ ఇప్పుడు ఇంటింటికీ నిత్యం నీరందిస్తున్నామని స్పష్టం చేశారు. త్వరలోనే 24 గంటలు మంచినీరు అందించేందుకు అన్ని చర్య లు తీసుకుంటున్నామని తెలిపారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన రూ.110 కోట్ల నిధులతో నగరంలోని ప్రధాన రహదారులను సుందరంగా తీర్చిదిద్దామన్నారు. ఇప్పటికే నగరంలో ఐటీ టవర్ పూర్తయిందని, కేబుల్ బ్రిడ్జి తుది దశకు వచ్చిందని చెప్పారు. మానేరు రివర్ ఫ్రంట్ పనులు కూడా వేగంగా సాగుతున్నాయని తెలిపారు. ఇవి పూర్తయితే కరీంనగర్కు ప్రపంచస్థాయి గుర్తింపు వస్తుందన్నారు. అభివృద్ధ్ది పనులకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, మేయర్ వై సునీల్రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణీహరిశంకర్, కార్పొరేటర్లు భూమాగౌడ్, సాగర్, బండారి వేణు, దిండిగాల మహేశ్, ఐలేందర్యాదవ్, బోనాల శ్రీకాంత్, వాల రమణారావు పాల్గొన్నారు.